
Flights Cancelled: మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా పలు విమానాలు రద్దు అయ్యాయి. ఢిల్లీ విమానాశ్రయానికి రావాల్సిన 28 విమానాలు, ఢిల్లీ నుంచి బయల్దేరాల్సిన 20 విమానాలు కలిపి మొత్తం 48 విమానాలు రద్దు చేయబడ్డాయి. క్యాన్సిల్ అయిన విమానాల్లో ఎయిర్ ఇండియాకు చెందిన 17 విమానాలు, ఇండిగోకు చెందిన 8 విమానాలు, ఇతర విమానయాన సంస్థలకు చెందిన 3 విమానాలు ఉన్నాయి. ఢిల్లీ నుంచి బయల్దేరాల్సిన పలు విమానాలను క్యాన్సిల్ చేస్తున్నట్లు ఆయా విమానయాన సంస్థలు ప్రకటించాయి. వీటిలో ఎయిర్ ఇండియాకు చెందిన 10, ఇండిగోకు చెందిన 7, ఇతర విమానయాన సంస్థకు చెందిన 3 విమానాలు ఉన్నాయి.
విమాన సంస్థలు ఏమన్నాయంటే?
మిడిల్ ఈస్ట్ లో విమానాశ్రయాలు క్రమంగా తిరిగి తెరుచుకుంటున్న నేపథ్యంలో తామూ నెమ్మదిగా కార్యకలాపాలను పునరుద్ధరిస్తున్నట్లు ఇండిగో తెలిపింది. “మేము పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ ఉన్నాం. సురక్షితమైన, సజావుగా ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాయిం. సురక్షితమైన విమాన మార్గాలను పూర్తిగా పరిశీలిస్తున్నాము. ఎప్పటికప్పుడు పూర్తి వివరాల కోసం మా వెబ్ సైట్ ను చూడండి” అని ఇండిగో తెలిపింది.
మధ్యప్రాచ్యంలో వైమానిక ప్రాంతం మూసివేయడం వల్ల దాని కొన్ని విమానాలు ప్రభావితం కాబోతున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. అటు ఆకాసా ఎయిర్ కూడా తమ సంస్థకు చెందిన పలు విమానాలు ఎఫెక్ట్ అవుతున్నట్లు తెలిపింది. “మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు ప్రయాణ ప్రణాళికలను ప్రభావితం చేస్తుంది. అసౌకర్యానికి చింతిస్తున్నాము. అన్ని విమాన కార్యకలాపాలు సురక్షితంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం. పూర్తి వివరాల కోసం మా వెబ్ సైట్ ను చూడండి” అని ఆకాసా ఎయిర్ ప్రకటించింది. ఖతార్, బహ్రెయిన్, UAE, ఇరాక్, కువైట్ దోహా లోని అల్ ఉదీద్ US సైనిక స్థావరంపై ఇరాన్ దాడి చేయడంతో తాత్కాలికంగా తమ దేశాల వైమానిక ప్రాంతాన్ని మూసివేశాయి. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.
Read Also: ఏ ఒప్పందమూ జరగలేదు.. ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్!