గత కొద్ది కాలంగా మావోయిస్టు లొంగుబాటు పెరిగింది. కేంద్ర బలగాల మోహరింపుతో చాలా మంది ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. తాజాగా ఛత్తీస్ గఢ్ లో మరో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ కి తమ ఆయుధాలను అప్పగించారు. వీరిలో 12 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై రూ.67 లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ పాలసీ ప్రకారం తక్షణ సాయం కింద రూ.50 వేలు చొప్పున నగదు సాయం అందిచారు.
గత కొంతకాలంగా పెరుగుతున్న లొంగుబాట్లు
మావోయిస్ట్ ముక్త్ భారత్ అంటూ కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఆపరేషన్ కగార్ ను చేపట్టింది. అప్పటి నుంచి పోలీసు బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మావోల లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్ గా చాలా మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. వీరిలో పలువురు కీలక నేతలు కూడా ఉన్నారు.
కొనసాగుతున్న భద్రతా బలగాల వేట
ఓవైపు లొంగుబాట్లు, మరోవైపు వేట కొనసాగుతుంది. ఈ ఏడాది మేలో మావోల పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ అలియాస్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అయ్యాడు. కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత అనేక మంది కీలక నేతలు హతమయ్యారు. ఇలా వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీల్లో చీలికలు మొదలయ్యాయి.
ఇటీవల పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న తమ అనుచరులతో కలిసి లొంగిపోయారు. ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కీలక నేత మాడ్వి హిడ్మా, ఆయన భార్య రాజే, టెక్ శంకర్ తదితరులు చనిపోయారు. వీరి ఎన్కౌంటర్ తర్వాత మవోల లొంగుబాట్లు మరింత పెరిగాయి. మార్చి 31, 2026 వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం ఇప్పటికే డెడ్ లైన్ పెట్టింది..





