భారీ ఆస్తులు, రాజకీయాల్లో డబ్బు ప్రభావం మరోసారి బయటపడింది. తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) విడుదల చేసిన నివేదిక ప్రకారం రాజ్యసభ సభ్యుల్లో 31 మంది బిలియనీర్లు ఉన్నారు. అందులో తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా ఉండటం ప్రత్యేకంగా కనిపిస్తోంది. మొత్తం 9 మంది తెలుగు ఎంపీలు ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. వీరిలో నలుగురు తెలంగాణకు, ఐదుగురు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు.
రూ.5,300 కోట్లతో బండి పార్థసారథి ఫస్ట్ ప్లేస్
అత్యధిక ఆస్తులు కలిగిన ఎంపీలలో బండి పార్థసారథి రూ.5,300 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా రాజేందర్ గుప్తా రూ.5,053 కోట్లతో , రెండో స్థానంలో, అయోధ్య రామిరెడ్డి రూ.2,577 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. టాప్ 10లో కూడా తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ఎంపీలు ఉండటం ఈ ప్రాంత రాజకీయ నాయకులు ఎంత ధనవంతులో చూపిస్తోంది.
రాజ్యసభ ఎంపీల సగటు ఆస్తి రూ.120 కోట్లు
తాజా నివేదికలో రాజ్యసభ ఎంపీల సగటు ఆస్తి రూ.120 కోట్లకు పైగా ఉండటం. మొత్తం 229 మంది ఎంపీల అఫిడవిట్లను విశ్లేషించిన ఏడీఆర్, మొత్తం ఆస్తులు రూ.27,638 కోట్లుగా అంచనా వేసింది. రాష్ట్రాలవారీగా తెలంగాణ ఎంపీలు అత్యధికంగా రూ.8,130 కోట్ల ఆస్తులతో ముందుండగా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. పార్టీలవారీగా చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు సగటు ఆస్తుల్లో ముందుండగా, వైఎస్సార్సీపీ ఎంపీలు రెండో స్థానంలో నిలిచారు. మరోవైపు, అత్యల్ప ఆస్తులు కలిగిన ఎంపీగా సంత్ బల్బీర్ సింగ్ కేవలం రూ.3 లక్షలతో ఉండటం విశేషం. .
73 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు
అయితే ఈ గణాంకాల మధ్య ఒక ఆందోళనకర అంశం కూడా వెలుగులోకి వచ్చింది. మొత్తం 73 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉండగా, అందులో 36 మందిపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. ఇది ప్రజాస్వామ్యంలో నైతిక ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.
