
Delhi Fire Accident: క్యాపిటల్ సిటీ న్యూఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రిఠాలా మెట్రో స్టేషన్ సమీపంలోని ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నికీలల్లో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వెంటనే స్పాట్ కు చేరుకుని ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 16 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయిన పోలీసులు తెలిపారు. అయితే, అగ్ని ప్రమాదం కారణంగా ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పొగ తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు.
అగ్ని ప్రమాదానికి కారణంపై అధికారులు ఆరా!
అటు ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలకు అసలు కారణం ఏంటనే అంశంపై పోలీసులు ఆరా తీశారు. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగినట్లు అంచనాకు వచ్చారు. అటు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రులు దగ్గరలోని ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అటు ఈ ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు. వాటిలో కొన్నింటిని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదన్నారు. ఈ మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు.
మిన్నంటిన బాధితుల రోదనలు
అటు ఈ ప్రమాదం గురించి తెలిసిన బాధిత కుటుంబ సభ్యులు హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని కంపెనీ యాజమాన్యం ప్రకటించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, పోలీసు విచారణకు సంపూర్ణంగా సహకరిస్తాయని వెల్లడించినట్లు సమాచారం.
Read Also: 24 మంది విద్యార్థులపై లైంగిక వేధింపులు, స్కూల్ టీచర్ అరెస్ట్!