•12 మంది రిమాండ్కు తరలింపు
•బాన్సువాడ పట్టణంలో పరిస్థితి ప్రశాంతం
•శాంతి భద్రతల పరిరక్షనే ముఖ్యం,మత సామరస్యానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవు
•విధ్వంసం సృష్టిస్తే కటకటాలే
•సోషల్ మీడియాపై పోలీస్ డేగ కన్ను
బాన్సువాడ,క్రైమ్ మిర్రర్ :- కామారెడ్డి జిల్లా బాన్సువాడలో (శుక్రవారం) రిలయన్స్ మార్ట్ వద్ద జరిగిన సంఘటనతో పాటు ఒక పోలీస్ కానిస్టేబుల్ గాయపడిన ఘటనపై కేసులు నమోదు చేసి,దర్యాప్తు వేగంగా కొనసాగిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఈ ఘటనలో పాల్గొన్న వారిలో 12 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచడం జరిగిందని,పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని,ఎవరు కూడా చట్టం నుంచి తప్పించుకునే వీలు లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.ఒక చిన్న సంఘటనను ఆధారంగా చేసుకుని,కొందరు గుంపులుగా ఏర్పడి,శాంతియుతంగా ఉన్న బాన్సువాడ పట్టణంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని,గుంపులలో కొందరు రాళ్లు విసరడం వలన గాయాలు సంభవించాయని,ఇటువంటి చర్యలను సహించబోమని,ఇకపై ఎవరైనా మత విద్వేషాలను ప్రేరేపించేలా,చట్టాన్ని తమ చేతిలోకి తీసుకునేలా ప్రవర్తించినట్లయితే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని,చట్టాన్ని ఎవరు కూడా తమ చేతుల్లోకి తీసుకోవద్దని,విద్వేషాలు ప్రేరేపించే వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతారని ఎస్పి తెలిపారు.
బాన్సువాడ పట్టణంలో ప్రస్తుతం పూర్తిగా ప్రశాంత వాతావరణం నెలకొందని,ప్రజలు ఎలాంటి భయంధోలనకు గురికాకుండా తమ దైనందిన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని అన్నారు.సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్,ఫేస్బుక్,,ఎక్స్ లో మత విద్వేషాలను రెచ్చగొట్టే ఆడియోలు,వీడియోలు లేదా సందేశాలను పోస్ట్ చేయడం,షేర్ చేయడం,వాట్సాప్ గ్రూప్ నిర్వాహకులను బాధ్యులుగా పరిగణిస్తూ వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు.ప్రజలు అసత్య ప్రచారాలు,వాదంతులు వ్యాప్తి చేయకుండా,బాధ్యతాయుతంగా వ్యవహరించి మత సామరస్యాన్ని కాపాడాలని తెలిపారు.

