తెలంగాణ

వాలంటీర్ల తరహాలో ఇందిరమ్మ కమిటీలు.. దసరాకు ముహుర్తం

కాంగ్రెస్ కార్యకర్తలకు పండగ లాంటి వార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ల తరహాలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలను అందులో భాగస్వామ్యం చేయనున్నారు. ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ‌/ వార్డు, మండ‌ల/ ప‌ట్ట‌ణ‌, నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా స్థాయి క‌మిటీల ఏర్పాటుకు విధివిధినాలు ఒక‌ట్రెండు రోజుల్లో రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.

అర్హుల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న నుంచి ఇత‌ర రాష్ట్రాలు ల‌క్ష‌ల సంఖ్య‌లో గృహాలు మంజూరు చేయించుకుంటే ఈ విష‌యంలో తెలంగాణ వెనుక‌బ‌డి ఉంద‌ని, ఈ ద‌ఫా కేంద్రం మంజూరు చేసే గృహాల్లో గ‌రిష్ట సంఖ్య‌లో రాష్ట్రానికి ఇళ్లు సాధించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. పీఎంఏవై కింద రాష్ట్రానికి రావ‌ల్సిన బ‌కాయిలు రాబ‌ట్టాల‌ని సీఎం సూచించారు. కేంద్ర ప్ర‌భుత్వానికి ఇవ్వాల్సిన స‌మాచారం వెంట‌నే ఇవ్వాల‌ని, ఇందిర‌మ్మ ఇళ్ల విష‌యంలో డాటాను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేయాల‌ని సీఎం అన్నారు. పెద్ద సంఖ్య‌లో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇంజినీరింగ్ సిబ్బంది స‌మ‌స్య ఎదుర‌య్యే ప‌రిస్థితి ఉంటుంద‌ని అధికారులు తెల‌ప‌గా… అవ‌స‌ర‌మైతే ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధ‌తిన నియామ‌కాలు చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి అన్నారు.

రాజీవ్ స్వగృహలో నిర్మించి నిరుప‌యోగంగా ఉన్న బ్లాక్‌లు, ఇళ్లు వేలం వేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ఏళ్ల త‌ర‌బ‌డి వృథాగా ఉంచ‌డం స‌రికాద‌ని, వెంట‌నే వేలానికి రంగం సిద్ధం చేయాల‌న్నారు. డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల ల‌బ్ధిదారుల ఎంపిక పూర్త‌యినా వాటిని ఎందుకు అప్ప‌గించ‌లేద‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. అర్హుల‌కు ఆ ఇళ్ల‌ను అప్ప‌గించాల‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో నిర్మించి నిరుప‌యోగంగా ఉన్న బ్లాక్‌ల‌కు మౌలిక వ‌స‌తులు క‌ల్పించి, వాటికి అర్హులైన ల‌బ్ధిదారుల‌కు అప్ప‌గించాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button