రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:-రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ను అమలు చేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఈ ఆంక్షలు మంగళవారం ఉదయం 7 గంటల నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు. సెక్షన్ అమలులో ఉన్న సమయంలో నలుగురు, అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకేచోట గుమికూడటం నిషేధమని తెలిపారు.
అలాగే ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించరాదని హెచ్చరించారు. కర్రలు, కత్తులు, తుపాకులు వంటి మారణాయుధాలను వెంట ఉంచుకోవడం పూర్తిగా నిషేధమని తెలిపారు.సోషల్ మీడియా, మైకుల ద్వారా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం, వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే చర్యలు చేపట్టడం, ప్లకార్డులు ప్రదర్శించడం కూడా నేరంగా పరిగణించబడుతుందని స్పష్టం చేశారు.విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు, కేంద్ర బలగాలు, హోంగార్డులు, ఎస్పీవోలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని వెల్లడించారు.చట్టాన్ని అతిక్రమించి శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
యాదగిరిగుట్ట,ఆలేరులో మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
