Homeతెలంగాణఏపీ సీఎంతో మాట్లాడే తుమ్మల.. తెలంగాణ సీఎంతో మాట్లాడడా!

ఏపీ సీఎంతో మాట్లాడే తుమ్మల.. తెలంగాణ సీఎంతో మాట్లాడడా!

ఖమ్మం వరద విలయంపై రాజకీయ రగడ సాగుతోంది. భారీ వర్షాలు కురుస్తున్నా.. వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినా సకాలంలో స్థానిక అధికారులు స్పందించలేదని ఆరోపణలు వస్తున్నాయి. వరద వచ్చే వరకు తమకు కనీస సమాచారం కూడా ఎవరు ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఇలాంటి దుస్థితి రావడం దారుణమనే టాక్ వస్తోంది.

ఖమ్మంలో వరద బాధితులను ఆదుకోవడంతో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. వరదల్లో కొట్టుకుపోతామన్న భయంతోనే ముఖ్యమంత్రి మంత్రులు బయటకు రాలేదా అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నిజంగా ప్రభుత్వం నుంచి సరైన ఆదేశాలు ఉంటే ప్రజలు బైటకి రారని చెప్పారు.మీ ప్రాణం కంటే ఎక్కువ ఎది ఉండదు బయటకు రాకండి అని ప్రభుత్వం.. అధికారులు ప్రజలకు తెలియజేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దురదృష్టవశాత్తూ ఒక సైంటిస్ట్‌ని వరదల వల్ల కోల్పోయామని జగదీశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం పని చేసిండని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. ఎక్కడ ఉన్నాడో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, భయపడుతుంటే, తిండి కొరకు, నీళ్ల కొరకు ఎదురుచూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో చెప్పాలన్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఏం పని చేసిండని జగదీశ్ రెడ్డి నిలదీశారు.

హెలికాప్టర్ కొరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతాడు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి తో మాట్లాడలేడా? అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. బహుశా తుమ్మలకు తెలంగాణ ముఖ్యమంత్రి అందుబాటులో లేడేమో అని జగదీశ్ రెడ్డి అన్నారు.

 

తాజావార్తలు