Yumnam Khemchand: మణిపూర్ సీఎంగా ఖేమ్‌ చంద్, ప్రమాణం చేయించిన గవర్నర్ భల్లా!

మణిపూర్ సీఎంగా ఖేమ్‌చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని ఇంఫాల్‌ లోని రాజ్‌ భవన్‌ లో ముఖ్యమంత్రిగా ఖేమ్‌చంద్ సింగ్ చేత.. ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ప్రమాణ స్వీకారం చేయించారు.

మణిపూర్ ముఖ్యమంత్రిగా యుమునాం ఖేమ్‌ చంద్ సింగ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని ఇంఫాల్‌ లోని రాజ్‌ భవన్‌ లో ఆయన చేత.. ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యే నెమ్చా కిప్‌జెన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యే ఎల్.డిఖో డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గతేడాది మణిపూర్‌లో విధించిన రాష్ట్రపతి పాలనను ఫిబ్రవరి 04న ఎత్తివేస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే ముఖ్యమంత్రిగా యుమునాం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఖేమ్‌చంద్ సింగ్‌ను ఎమ్మెల్యేలు మంగళవారం నాడు ఎన్నుకున్నారు.

మణిపూర్ లో అల్లర్ల కారణంగా రాష్ట్రపతి పాలన

2023లో మే మాసంలో జాతుల మధ్య ఘర్షణల కారణంగా మణిపూర్ రాష్ట్రం అట్టుడికింది. దాంతో 250 మందికి పైగా ప్రజలు మరణించారు. వేలాది మంది రాష్ట్రం విడిచి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిపోయారు. ఆ తర్వాత అంటే.. ఈ ఘర్షణలు చోటుచేసుకున్న దాదాపు తొమ్మిది నెలల అనంతరం బీరెన్ సింగ్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దాంతో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఎవరీ ఖేమ్‌చంద్ సింగ్‌?

ఇంకోవైపు ప్రస్తుత సీఎం ఖేమ్‌చంద్ సింగ్‌.. 2017 నుంచి 2022 వరకు మణిపూర్ అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత బీరెన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోని మైతేయిలు, కుకీలు, నాగాలతో ఖేమ్‌చంద్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఆయనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button