
CM Revanthreddy Review On Rains: గత ఏడాదితో పోల్చితే ఈసారి ముందుగానే రుతుపవనాలు రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాకాల సంసిద్ధత, హైదరాబాద్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన 141 వాటర్ లాంగింగ్ పాయింట్స్ లో వాటర్ హార్వెస్టింగ్ వెల్ పనుల కొనసాగింపుపై ఆరా తీశారు. హార్వెస్టింగ్ వెల్స్ లోకి వచ్చే వాన నీటిని ఆటోమేటిక్ పంపుల ద్వారా బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
24 గంటలు అలర్ట్ గా ఉండండి
వాతావరణశాఖ సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు, వరదలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నుంచి మానిటర్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వర్షం పడే సమయంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్, ఇతర సమసయలు రాకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు అలర్ట్ గా ఉండాలన్నారు. ఈ నాలుగు విభాగాలు అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అసంపూర్ణంగా ఉన్న నాలాల పూడికతీత పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
సమస్యాత్మక ప్రాంతాలపై ఫోకస్ పెట్టండి
ఇక సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నన కోర్ అర్బన్ రీజియన్ లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణ, అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. వర్షాకాలంలో ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, హైడ్రా, జీహెచ్ఎంసీ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.