
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో : తెలంగాణ బీజేపీలో ముసలం పుట్టింది. కొంతకాలంగా సొంత పార్టీ నేతలపై అసమ్మతి రాగం వినిపిస్తున్న రాజాసింగ్… తప్పుకున్నారు. కమలం పార్టీకి గుడ్బై చెప్పేశారు. మీకో దండం.. మీ పార్టీలో దండం అంటూ రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇదంతా ఎందుకంటే… రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై అట. అంటే.. తెలంగాణ బీజేపీ చీఫ్గా రామచందర్రావు నియామకం రాజాసింగ్కు నచ్చలేదా…? లేదా.. తనకు ఆ పదవి ఇవ్వలేదన్న కోపమా..?
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసేశారు. తన రాజీనామా ఆమోదించాలని కోరారు. అంతేకాదు.. కిషన్రెడ్డిపై భగ్గుమన్నారు రాజాసింగ్. కొన్నేళ్లుగా కమలం పార్టీలో తాను ఇబ్బంది పడుతున్నానని అన్నారు రాజాసింగ్. తెలంగాణలో బీజేపీని పవర్లో తీసుకురావాలని తాను ఆశపడుతుంటే… పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందగా నిర్ణయించుకున్న అధ్యక్షుడినే ప్రకటించారని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు వచ్చిన తన మద్దతుదారులను బెదిరించారని ఆరోపించారు రాజాసింగ్.
గోషామహల్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా విజయం సాధిస్తున్న రాజాసింగ్.. కొన్నేళ్లుగా సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా… కేంద్రమంత్రి కిషన్రెడ్డికి, రాజాసింగ్కు అస్సలు పడటంలేదు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో బండి సంజయ్ రంగంలోకి దిగి.. రాజాసింగ్కు నచ్చజెప్పారు. ఎన్నికలు అయినపోయిన తర్వాత.. మళ్లీ షరా మామూలే. పార్టీని నిలబెట్టేవారి కన్నా పట్టగొట్టేవారే ఎక్కువగా ఉన్నారని.. ఆయన పదే పదే ఆరోపణలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని రాజాసింగ్ భావించినట్టు సమాచారం. ఆ అవకాశం ఇవ్వకపోవడంతో.. ఆయన పార్టీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. పార్టీకి రాజీనామా చేసిన ఆయన… నెక్ట్స్ స్టెప్ ఏంటి…? ఏ పార్టీలోకి వెళ్తారు..? ముఖ్యంగా ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతారా…? పదవికి కూడా రాజీనామా చేస్తారా…? అసలు రాజాసింగ్ రాజీనామా ఆమోదం పొందుతుందా…? ఇప్పుడు ఈ చర్చ జోరుగా జరుగుతోంది.