గుంటూరు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి, తన ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. కుటుంబాల మధ్య ఏర్పడిన విభేదాలు, సామాజిక అడ్డంకులు చివరకు ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి. ఈ సంఘటనతో రెండు కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయాయి.
వివరాల్లోకి వెళ్తే గుంటూరు నగరంలోని స్వర్ణ భారతి నగర్కు చెందిన రాజు అనే యువకుడు జేకేసీ కాలేజ్లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదే సమయంలో అంకమ్మ నగర్కు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడి, అది క్రమంగా ప్రేమగా మారింది. గత 2 సంవత్సరాలుగా ఇద్దరూ పరస్పరం ప్రేమించుకుంటూ, భవిష్యత్తులో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా, రాజు తల్లిదండ్రులు పెళ్లికి సమ్మతించినప్పటికీ, యువతి తల్లిదండ్రులు మాత్రం అంగీకరించలేదు.
గతంలో ఒక దశలో యువతి తల్లిదండ్రులు ఈ సంబంధానికి ఒప్పుకున్నప్పటికీ, అప్పుడు రాజు కుటుంబం నిరాకరించడం వల్ల పెళ్లి జరగలేదు. అంతేకాకుండా ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడం కూడా ఈ సంబంధానికి అడ్డంకిగా మారింది. ఈ పరిణామాల మధ్య గత నెల 15వ తేదీన యువతికి ఆమె తల్లిదండ్రులు మరో వ్యక్తితో వివాహం జరిపించారు. పెళ్లి అనంతరం అత్తవారింటికి వెళ్లిన యువతి, 3 రోజుల క్రితం తిరిగి గుంటూరుకు వచ్చింది. ఈ విషయం తెలిసిన రాజు ఆమెను కలుసుకుని మాట్లాడాడు. ఈ సందర్భంలో ఇద్దరూ తీవ్ర భావోద్వేగానికి లోనై కలిసి జీవితం ముగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ నెల 7వ తేదీన ఇద్దరూ కలిసి కొండవీడు ప్రాంతానికి వెళ్లి పురుగుమందు సేవించి ఆత్మహత్యకు యత్నించారు. అక్కడి పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 8వ తేదీన రాజు మృతి చెందగా, 9వ తేదీన యువతి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటనతో రెండు కుటుంబాల్లో దుఃఖ ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తమ పిల్లలను కోల్పోయిన బాధను తట్టుకోలేకపోతున్నారు.
ఈ ఘటనపై రెండు కుటుంబాల తల్లుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లల మనసులు అర్థం చేసుకోకుండా పెద్దలు పట్టుదలగా వ్యవహరించడం, సామాజిక భేదాలు ప్రాధాన్యం ఇవ్వడం వంటి కారణాలు చివరకు ఇలాంటి దుర్ఘటనలకు దారితీస్తున్నాయని స్థానికులు భావిస్తున్నారు. యువతలో భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకుని, సమయానికి సరైన మార్గదర్శనం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
ALSO READ: RBI: UPI, IMPS చెల్లింపుల్లో మార్పులు
