తెలంగాణ

కాంగ్రెస్‌ నేతపైకి బాటిల్‌ను విసిరిన మహిళా ఎమ్మెల్యే

  • కుమ్రం భీం జిల్లా జంకాపూర్‌లో ఘటన

  • రేషన్‌ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆగ్రహం

  • కాంగ్రెస్‌ నేత శ్యామ్‌ నాయక్‌పై బాటిల్‌తో దాడి

  • అదనపు కలెక్టర్‌ సమక్షంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం

క్రైమ్‌మిర్రర్‌, అసిఫాబాద్‌: కుమ్రం భీం అసిఫాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఏకంగా ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఈ తంతు కొనసాగుతోంది. తాజాగా ఇరుపార్టీల నేతల మధ్య మాటామాటా పెరిగి దాడుల చేసే స్థాయికి చేరుకుంది.

అసిఫాబాద్‌ నియోజకవర్గం జంకాపూర్‌లో గురువారం రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సభకి అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ సహా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు హాజరయ్యారు. సభలో అధికార, విపక్ష నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేత శ్యామ్‌ నాయక్‌పై వాటర్‌ బాటిల్‌తో దాడి చేశారు ఎమ్మెల్యే కోవ లక్ష్మి.

సభలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ… కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి హామీలను తుంగలో తొక్కారని ఆక్షేపించారు. కోవ లక్ష్మి వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ శ్యామ్‌ నాయక్‌ వెంటనే కౌంటరిచ్చారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా ఏ హామీ నెరవేర్చలేదని, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఎదురుదాడికి దిగారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే కోవ లక్ష్మి… అక్కడే ఉన్న వాటర్‌ బాటిల్‌ను శ్యామ్‌ నాయక్‌పైకి విసిరారు. ఈ ఘటనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఊహించని పరిణామంతో సభలో గందరగోళం నెలకొంది. అధికారులు వెంటనే జోక్యం చేసుకొని పరిస్థితిని సద్దుమణించారు.

Read Also: 

  1. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న అలనాటి హీరో.. విజయ్ పార్టీలోకే ఎక్కువ అవకాశాలు?
  2. బీసీ రిజర్వేషన్లపై ఆఖరిపోరాటం ముగిసింది: రేవంత్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button