
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో : ఎమ్మెల్సీ కవిత.. తండ్రి కేసీఆర్ను కలిశారు..? కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ వెళ్లేముందు భర్తతో కలిసి ఎర్రవల్లి ఫామ్హౌస్కు వెళ్లి.. తండ్రిని కలిశారు కవిత. ఆ తర్వాత.. తండ్రితో కలిసి కాళేశ్వరం కమిషన్ ఉన్న బీఆర్కే భవన్ వరకు వెళ్లినట్టు సమాచారం. అయితే… చాలా కాలం తర్వాత… కేసీఆర్ను కవిత కలవడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా..? అన్న చర్చ జరుగుతోంది.
కవిత… కొంతకాలంగా బీఆర్ఎస్ నుంచి దూరంగా ఉన్నారు. తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించుకుని.. సొంతంగా కార్యచరణ రూపొందించుకుంటున్నారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ… సొంత పార్టీపై విమర్శలు చేసి.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. తన తండ్రిని కలిసేందుకు కూడా కొందరు అడ్డుపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు కవిత. దీంతో సోదరుడు కేటీఆర్తో… ఆమె విభేదించారన్న వార్తలు వచ్చాయి. అందుకే జాగృతి పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారని కూడా సమాచారం. కేసీఆర్కు కాళేశ్వరం నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ… ఆమె ఇటీవల ధర్నా కూడా చేశారు. ఆ ధర్నాలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనలేదు. అంటే… తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ వేరు వేరు అనే సంకేతాలు వెళ్లాయి.
ఈ క్రమంలో… కేసీఆర్, కవితను కలవడం చర్చనీయాంశమైంది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంతో.. విచారణకు హాజరయ్యారు కేసీఆర్. విచారణకు వెళ్లేందుకు ఎర్రవల్లి ఫామ్హౌస్కు వెళ్లి కేసీఆర్ను కలిశారు కవిత. ఆ సమయంలో కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత తండ్రితో కలిసి బీఆర్కే భవన్ వరకు కూడా వెళ్లారట కవిత. ఉన్నట్టుండి కవిత.. కేసీఆర్ను కలవడం. ఆమె భర్త కూడా వెంట ఉండటం ఆసక్తి రేపుతోంది. ఈ భేటీ వెనుక రాజకీయ వ్యూహం ఉందా..? అన్న కోణంలోనూ చర్చించుకుంటున్నారు.