
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో :-చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో రీఎంట్రీ ఇస్తారా..? బీజేపీలో చేరబోతున్నారా..? పిలిస్తే చాలు చిరంజీవి తమ పార్టీలో చేరిపోతారన్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యల వెనుక అర్థమేంటి…? రాజకీయాల్లోకి వచ్చేది లేదని చిరంజీవి పదే పదే చెప్తున్నా… ఆయన వస్తారు అంటూ ఎంత ధీమాగా కిషన్రెడ్డి అలా ఎలా చెప్పారు..? అంటూ చర్చ మొదలైంది.
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో ఒక సంచలనం. రాజకీయాల్లోకి వెళ్లి వచ్చారు. ప్రజారాజ్యం పెట్టి.. దాన్ని కాంగ్రెస్లోనే విలీనం చేశారు. ఆ తర్వాత పాలిటిక్స్ తనకు సరిపడవంటూ… సినీ పరిశ్రమలో సంతోషం ఉందంటూ సినిమాలు చేసుకుంటున్నారు. జీవితాంతం సినిమాలే తప్ప… మళ్లీ రాజకీయాల వైపు వెళ్లబోనని చాలా సార్లు చెప్పారు మెగాస్టార్. అయితే.. ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలతో చిరంజీవి రాజకీయ ఎంట్రీపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. చిరంజీవి బీజేపీలో చేరుతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు బలం చేకూర్చాయి. తాను పిలిస్తే చాలు.. కాదనకుంఆ చిరంజీవి బీజేపీలో చేరుతారని చిట్చాట్లో చెప్పారు కిషన్రెడ్డి. బీజేపీలోకి ఎవరైనా రావాలనుకుంటే పిలిచేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని చెప్పారు.
కిషన్రెడ్డి.. చాలా వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. చిరంజీవి మాత్రమే కాదు.. ఎంతో మంది సినీ ప్రముఖులతో బీజేపీకి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారాయన. చాలా మంది సినీ ప్రముఖులు బీజేపీలో చేరి మంత్రులు అయ్యారని కూడా గుర్తుచేశారు. అంతేకాదు… బీజేపీ కోసం సినీస్టార్స్ ప్రచారం కూడా చేశారన్నారు. అందులో వాస్తవం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి గతంలో కృష్ణంరాజు, విజయశాంతి, కోట శ్రీనివాసరావు వంటి వాళ్లు బీజేపీ పనిచేశారు. కొందరు మంత్రులు కూడా అయ్యారు. మరికొందరు బీజేపీ కోసం ప్రచారం చేశారు. మరి కిషన్రెడ్డి ఇప్పుడు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారంటే… సినీగ్లామర్ను పార్టీకి జోడించుకోవాలనే బీజేపీ ఆకాంక్షను ఆయన ఇలా బయటపెట్టారని అంటున్నారు.
ఇక.. చిరంజీవి విషయానికి వస్తే… ఆయన మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని గట్టిగానే చెప్పారు. గతంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ను కలిసినప్పుడు.. రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించినా.. ఆ ఆలోచన లేదని తిరస్కరించారు చిరంజీవి. గతంలో వైసీపీ రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పినా… నో అనేశారు. అంతేకాదు.. బీజేపీ నుంచి కూడా ఇప్పటికే ఆయనకు ఆఫర్లు వెళ్లాయి. కానీ.. ఆయన పాలిటిక్స్లోకి వచ్చేందుకు నిరాకరిస్తూనే వచ్చారు. పవన్ కళ్యాణ్ జనసేనతో ముందుకువెళ్తుంటే… పరోక్షంగా ఆయనకు మద్దతు ఇస్తున్నారు చిరంజీవి. అయితే.. కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న కిషన్రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు అన్నదే ఇప్పుడు చర్చ. గాల్లో రాయి వేశారా…? చిరంజీవి స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని భావించారా..? లేక.. నిజంగానే చిరంజీవి బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయా..? అదీ కాదంటే… వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున చిరంజీవి ప్రచారం చేయొచ్చా..? అన్నది తేలాల్సి ఉంది.