
Viral Post: బెంగళూరుకు చెందిన ఓ యువకుడు రెడిట్లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తాము ఉంటున్న అపార్ట్మెంట్లో ఇద్దరు యువతులు రాత్రి అతిథులుగా ఉన్నారని .. సొసైటీ తమపై రూ.5 వేల జరిమానా వేసిందని అతడు ఆన్లైన్లో వెల్లడించాడు. తన ఫ్లాట్మెట్తో కలిసి ఉండే ఈ యువకుడు, సొసైటీ ఇచ్చిన బిల్లు స్క్రీన్షాట్ను కూడా పోస్ట్ చేసి, ఇలాంటి నియమాలు అమలు చేయడానికి హౌసింగ్ సొసైటీకి ఏమైనా అధికారాలు ఉన్నాయా అని ప్రశ్నించాడు.
ఈ అపార్ట్మెంట్లో అవివాహితులకే ప్రత్యేకంగా కొన్ని పరిమితులు పెట్టారని, అదే సమయంలో కుటుంబంతో ఉంటున్నవారికి ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నాడు. బ్యాచిలర్స్కు రాత్రివేళ అతిథులు ఉండకూడదని, ఫ్యామిలీ విషయంలో మాత్రం అలాంటిది లేదని అన్నాడు. అన్ని రకాల మెయింటెనెన్స్ చెల్లిస్తున్నప్పటికీ, విభిన్న నియమాలు ఎందుకు? అంటూ అసహనం వ్యక్తం చేశాడు.
నవంబర్ 1న జారీ చేసిన ఆ ఇన్వాయిస్లో అక్టోబర్ 31న జరిగిన ‘‘ఇన్ఫ్రాక్షన్’’ పేరుతో జరిమానా వేశారు. ‘‘ఇద్దరు యువతులు రాత్రంతా ఉన్నారు’’ అనే కారణాన్ని బిల్లు వివరాల్లో సొసైటీ స్పష్టంగా నమోదు చేసింది. దీనిపై రెడిట్లో చాలామంది స్పందిస్తూ, ఒకే కమ్యూనిటీలో కుటుంబాలు, బ్యాచిలర్స్కు వేర్వేరు నియమాలు పెట్టడం ఎంతవరకు సరైంది? ఇలాంటి వివక్షాత్మక నియమాలకు చట్టపరమైన విలువ ఉందా? అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.




