ఈసారి గన్నవరంలో నో ఛాన్స్
విజయవాడ ఎంపీగా బరిలోకి
తేల్చి చెప్పిన జగన్ మోహన్ రెడ్డి
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు జగన్మోహన్ రెడ్డి అల్టిమేటం ఇచ్చారా? వచ్చే ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇచ్చారా? గన్నవరం నియోజకవర్గం ఈసారి ఇవ్వలేని తేల్చి చెప్పారా? బదులుగా విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడ పార్లమెంట్ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు జగన్మోహన్ రెడ్డి. రకరకాల ఈక్వేషన్స్ తెరపైకి వచ్చాయి. కానీ ఇప్పుడు చివరి ఆప్షన్ గా వల్లభనేని వంశీ మోహన్ ను జగన్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
వైసీపీలోకి ఫిరాయింపు..
మొన్నటి ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు వల్లభనేని వంశీ మోహన్. అయితే 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అలా వెళ్లిన వంశీ చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులపై సైతం తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు. అత్యంత వివాదాస్పద నేతగా ముద్రపడింది ఆయనపై. అందుకే కూటమి వచ్చిన తర్వాత ఆయనపై చర్యలకు దిగింది. రకరకాల కేసులు వెంటాడాయి. నెలల తరబడి జైల్లో ఉండి పోవాల్సి వచ్చింది. బెయిల్ పై బయటకు వచ్చిన వంశి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి.
టిడిపి ఎమ్మెల్యే దూకుడు..
అయితే ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గంలో పట్టు బిగించారు. మరోసారి వల్లభనేని వంశీ మోహన్ పోటీ చేసిన పెద్దగా ఫలితం ఉండదు. సర్వేల్లో ఇదే అంశం తేలడంతో జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అందుకే అక్కడ ప్రత్యామ్నాయ నేతను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వల్లభనేని వంశీ మోహన్ వస్తే ఒక సామాజిక వర్గం అక్కడ ఆయనను వ్యతిరేకించడం ఖాయం. పైగా యార్లగడ్డ వెంకట్రావు క్లీన్ ఇమేజ్ తో ముందుకు సాగుతున్నారు. అటువంటి చోట ఆయనను ఢీ కొట్టాలంటే కొత్త వ్యక్తిని రంగంలో దిగడమే మేలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఒకరిద్దరూ ఎన్నారైలు సైతం జగన్మోహన్ రెడ్డిని సంప్రదించినట్లు ప్రచారం సాగుతోంది.
వైసీపీకి దొరకని విజయవాడ..
అయితే వల్లభనేని వంశీ మోహన్ ను పొమ్మన లేక పొగ పెట్టే విధంగా విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన మూడు ఎన్నికల్లోను విజయవాడలో ఓటమి ఎదురైంది ఆ పార్టీకి. రకరకాల ప్రయోగాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ అందరిని ద్రాక్షగా మిగిలింది విజయవాడ పార్లమెంట్ సీటు. అందుకే ఈసారి వల్లభనేని వంశీ మోహన్ ను రంగంలోకి దించాలని జగన్మోహన్ రెడ్డి సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే 2009లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవం ఉంది వంశీకి. అయితే రాజకీయాల పట్ల విముఖత భావంతో ఉన్న వంశీ అందుకు అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాలి.

