
Russia-UkraineAttacks: రష్యా, ఉక్రెయిన్ మధ్య వరుస దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడింది. 800 డ్రోన్లు, 13 క్షిపణులతో సెంట్రల్ కీవ్ లో మంత్రులు నివసించే క్యాబినెట్ భవనంతో పాటు పలు నగరాలు, పట్టణాలపై వైమానిక దాడికి దిగింది. ఫస్ట్ రష్యా వాయుసేన సెంట్రల్ కీవ్లో మంత్రులు నివసించే భవనం లక్ష్యంగా దాడులు జరిపింది. ఈ దాడిలో ఏడాది చిన్నారి సహా ముగ్గురు మరణించారు.
ప్రతీకార దాడులకు దిగిన ఉక్రెయిన్
రష్యా దాడులను తీవ్రంగా పరిగణించిన ఉక్రెయిన్ ప్రతీకార దాడులకు దిగింది. రష్యా బ్రయాన్స్ లోని డ్రుజ్బా ఆయిల్ పైపులైన్ పై దాడి చేసింది. రెండు దేశాలు కూడా ప్రభుత్వ మౌలిక సదుపాయాలు లక్ష్యంగా దాడులు జరుపుకున్నాయి.ఈ దాడిలో ఇతర ఉక్రెయిన్ నగరాలను కూడా రష్యా లక్ష్యంగా చేసుకుంది. క్రెమెన్ చుక్ లో డజన్ల కొద్దీ విద్యుత్ సౌకర్యాలు రష్యా దాడితో దెబ్బతిన్నాయి. అలాగే అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరమైన క్రివీరిహ్ లో కూడా క్షిపణులు రవాణా, మౌలిక సదుపాయాలపై దాడులు జరిపాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా జరిపిన అతిపెద్ద గగనతల దాడుల్లో ఇదొకటిగా విశ్లేషకులు వెల్లడించారు. .