
Trump On India: భారత్ పై అసత్య వ్యాఖ్యలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి అలాంటి మాటలే మాట్లడారు. భారత్ మీద విధించిన అధిక టారిఫ్ లను సమర్థించుకుంటూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అమెరికా దిగుమతులపై సుంకాలను సున్నాకు తగ్గించేందుకు భారత్ ముందుకొచ్చిందన్నారు. అయితే, ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని ట్రంప్ వెల్లడించారు.
ముగ్గురు నాయకుల భేటీ తర్వాత ట్రంప్ రియాక్షన్
రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లతో ప్రధాని మోడీ సమావేశమైన కొన్నిగంటల్లోనే సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఓ పోస్టు పెట్టారు. భారత్ తో అమెరికా చాలా తక్కువగా వ్యాపార సంబంధాలు కలిగి ఉందని కొందరు అనుకుంటారని.. అయితే అమెరికాలో భారత్ భారీస్థాయిలో వ్యాపారం చేస్తోందని ట్రంప్ చెప్పారు. వాణిజ్యపరంగా భారత్కు అమెరికా అతిపెద్ద కొనుగోలుదారు అని వెల్లడించారు. అమెరికాలో భారత్ భారీగా వస్తువులను విక్రయిస్తోందని, అమెరికా మాత్రం భారత్ విధిస్తున్న అధిక సుంకాల కారణంగా అక్కడ వస్తువులను విక్రయించలేకపోతోందన్నారు. ఇది కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుందన్నారు.
మీరూ సుంకాలు విధించండి!
భారత్పై తాము విధించినట్లే యూరోపియన్ యూనియన్ కూడా అదనపు సుంకాలు వేయాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. దీంతో పాటు భారత్ నుంచి చమురు, గ్యాస్ కొనుగోలును ఆపివేయాలని కూడా కోరుతోంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలుపై ఈయూ పూర్తి నిషేధం విధించాలంటున్నది. పలు అంతర్జాతీయ పత్రికలు ఈవిషయాన్ని వెల్లడించాయి.