ప్రజావాణి కార్యక్రమంలో ఎల్బీనగర్ జోన్ జాయింట్ కమిషనర్ క్రిష్ణ కుమారి కి ఫిర్యాదు
బీసీ విభాగం రాష్ట్ర నాయకుడు గట్ట రవీంద్ర
క్రైమ్ మిర్రర్, ఎల్బీనగర్ (హైదరాబాద్): వీధి వ్యాపారులు వందల సంఖ్యలో రోడ్లపై తోపుడు బండ్లు ఏర్పాటు చేయడం వల్ల సర్వీస్ రోడ్డు పూర్తిగా రద్దీగా మారాయని కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర నాయకుడు గట్ట రవీంద్ర (హైటెక్ రాము)పేర్కొన్నారు.
ఆర్కే పురం డివిజన్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ నుంచి చైతన్యపురి వరకు ఉన్న సర్వీస్ రోడ్డు ఇరుపకళ తోపుడు బండ్లు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని సోమవారం ఎల్బీనగర్ జోన్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కృష్ణకుమారి కి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 9వ తేదీన కూడా సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ కు కూడా ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు అన్నారు. సర్వీస్ రోడ్డుతో పాటు నాగోలు కొత్తపేట మహాలక్ష్మి, ఓమ్ని ఆసుపత్రి రోడ్డులో తెల్లవారుజాము నుంచి ఉదయం 9:30 గంటల వరకు వందలాది పండ్ల వాహనాలు రోడ్డుపైనే వ్యాపారాలు చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు.
ఇంటర్మీడియట్ పరీక్షల కోసం వెళుతున్న విద్యార్థులకు మహాలక్ష్మి థియేటర్, ఓమ్ని ఆసుపత్రి, బి జె ఆర్ భవన్, చైతన్యపురి, సర్వీస్ రోడ్ల వద్ద తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. పండ్ల వ్యాపారుల వాహనాల వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుండడంతో ఇంటర్ విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోతున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నడిరోడ్డుపై ప్రతిరోజు కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తూ ట్రాఫిక్ సమస్యకు కారణం అవుతున్న వాహనాలు, వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజావాణిలో విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
