
ఏపీ, తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు రేపు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీలో పోటీ హోరాహోరీగా ఉండనుంది. ఈ స్థానం నుంచి పీఆర్టీయూటీఎస్ (PRTUTS) నుంచి పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, జాక్టో నుంచి మాజీ ఎమ్మెల్సీ పూర రవీందర్, బీజేపీ నుంచి పులి సరోత్తమ్రెడ్డి పోటీ పడుతున్నారు. వీరి మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ఇక.. టీపీఆర్టీయూ (TPRTU) నుంచి హర్షవర్ధన్, సీపీఎస్ఈయూ (CPSUE) నుంచి వెంకటస్వామి బరిలో ఉన్నారు.
కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలోనూ హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి మరోసారి పోటీచేస్తుండగా.. బీజేపీ నుంచి మల్క కొమురయ్య బరిలో ఉన్నారు. వీరి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇక… పీఆర్టీయూటీఎస్ (PRTUTS) నుంచి వంగ మహేందర్రెడ్డి, సీపీఎస్ఈయూ (CPSUE) నుంచి తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి, టీపీటీఎఫ్ (TPTF) నుంచి అశోక్కుమార్తో పాటు మరికొందరు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా రేపు జరుగుతోంది. ఈ ఎన్నిక బరిలో… కాంగ్రెస్ నుంచి నరేందర్రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక… కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్, ట్రస్మా మాజీ అధ్యక్షుడు శేఖర్రావుతోపాటు బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ కూడా పోటీలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లోనూ హోరాహోరీ…
ఏపీలో గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో 25 మంది ఉండటంతో.. ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అయితే.. ప్రధానంగా కూటమి అభ్యర్థి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్, ప్రస్తుత ఎమ్మెల్సీ లక్ష్మణరావు (PDF) మధ్యే పోటీ కనిపిస్తోంది.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలోనూ అదే పరిస్థితి ఉంది. కూటమి, పీడీఎఫ్ (PDF) మధ్యే పోటీ ఉంది. కూటమి నుంచి టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ నుంచి డీవీ రాఘవులు బరిలో ఉన్నారు.
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక నువ్వా నేనా అన్నట్టు ఉంది. ఇక్కడ ఏపీటీఎఫ్ (APTF) నుంచి పాకలపాటి రఘువర్మ, పీఆర్టీయూ (PRTU) నుంచి గాదె శ్రీనివాసుల నాయుడు, యూటీఎఫ్ (UTF) నుంచి కోరెడ్ల విజయగౌరి పోటీ చేస్తున్నారు. వీరి మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది.