వేడుకలు, పార్టీల సందడి ఎక్కడ ఉన్నా అక్కడ మద్యం వినియోగం సాధారణంగా కనిపించే దృశ్యమే. చాలా మంది మద్యాన్ని శీతల పానీయాలు, సోడా లేదా పండ్ల రసాలతో కలిపి తాగడం అలవాటు చేసుకున్నారు. రుచి మెరుగ్గా ఉంటుందనే భావనతో ఈ విధానం ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి తీవ్ర హానిని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చే ఈ మిశ్రమం, దీర్ఘకాలంలో శరీరంపై తీవ్రమైన ప్రభావాలు చూపే ప్రమాదం ఉందని స్పష్టంగా చెబుతున్నారు.
మద్యం, శీతల పానీయాలు రెండూ మూత్రవిసర్జనను పెంచే లక్షణం కలిగి ఉండటంతో, ఈ రెండింటిని కలిపి తీసుకున్నప్పుడు శరీరంలోని నీటి శాతం వేగంగా తగ్గిపోతుంది. దీనివల్ల నిర్జలీకరణ సమస్య తలెత్తుతుంది. ఈ పరిస్థితిలో అలసట, తలనొప్పి, బలహీనత వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అంతేకాకుండా శీతల పానీయాలు, పండ్ల రసాలలో ఉండే అధిక చక్కెర రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచుతుంది. ఇది ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి ప్రమాదకరంగా మారుతుంది.
ఇక ఈ కలయిక వల్ల మత్తు ప్రభావం వేగంగా పెరుగుతుంది. దాంతో వ్యక్తి తన నియంత్రణ కోల్పోయి సాధారణం కంటే ఎక్కువగా మద్యం సేవించే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో గుండె స్పందన వేగం పెరగడం, రక్తపోటు అధికమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా శక్తి పానీయాలలో ఉండే కెఫీన్ గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొన్నిసార్లు స్పృహ కోల్పోయే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మద్యాన్ని నీటితో కలిపి తీసుకోవడం వల్ల కలిగే హాని తక్కువగా ఉంటుంది. అయితే శీతల పానీయాలు, అధిక చక్కెర కలిగిన రసాలతో కలిపి తాగడం వల్ల కాలేయం, గుండె, జీర్ణవ్యవస్థపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు పడతాయి. ఈ విధమైన మిశ్రమాలు శరీరంలో కొవ్వు నిల్వలను పెంచి, వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
ALSO READ: ఈ నాలుగు ఇంట్లో ఉంటే చాలు.. ఇక డాక్టర్తో పనిలేదు
