తెలంగాణ

ఈ ‘బండి’ మనకు అవసరమా.. కూకట్ పల్లి కాంగ్రెస్‌లో రచ్చ

తెలంగాణ కాంగ్రెస్ లో వర్గపోరు ముదురుతోంది. మంత్రులే బహిరంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. బూతులు తిట్టుకుంటున్నారు. ఇక నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. హైదరాబాద్ పరిధిలోని కూకట్ పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేశ్ తీరుపై ఆగ్రహంగా ఉన్న నేతలు మరోవర్గంగా తయారై పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బండి రమేశ్ వ్యతిరేక వర్గం కూకట్ పల్లి సీనియర్ నాయకుడు శేరి సతీష్ రెడ్డి నాయకత్వంలో దూకుడుగా వెళుతోంది. 30 ఏళ్లుగా పార్టీలో ఉన్న శేరి సతీష్ రెడ్డికి కేంద్ర మాజీ మంత్రులు, ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో ఉన్న మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏఐసీసీ, పీసీసీ ముఖ్యనేతల అండదండలతో బండి రమేశ్‌కు ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తున్నారు శేరి సతీష్ రెడ్డి.

కొంత కాలంగా బండి రమేశ్, శేరి సతీష్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఒకరి కార్యక్రమానికి మరొకరికి వెళ్లడం లేదు. తాజాగా శేరి సతీష్ రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టుకున్న పోస్టులు కూకట్ పల్లి కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. ఇది మనకు అవసరమా.. ఒక్కసారి ఆలోచించండి కూకట్ పల్లి ప్రజలారా.. అంటూ ఓ ఎడ్లబండి ఫోటోను తన వాట్సాస్ స్టేటస్ గా పెట్టుకున్నారు శేరి సతీష్ రెడ్డి. బండి రమేశ్ మనకొద్దు అనే సందేశం ఇచ్చేలా ఈ పోస్టు పెట్టారని క్లియర్ గా తెలుస్తోంది. అంతేకాదు శేరి సతీష్ రెడ్డి అనుచరులు ఆ పోస్టును కాంగ్రెస్ గ్రూపుల్లో వైరల్ చేశారు. సతీష్ రెడ్డి నేరుగా తన వాట్సాప్ స్టేటస్‌లో బండి రమేశ్ ను టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టడం చర్చగా మారింది.

బండి ఫోటోతో ఆగని సతీష్ రెడ్డి..కార్యకర్తలు జెండాలు మోయాల్సిందే.. ధర్నాలు చేయాల్సిందే.. పోటీ చేసేటోడు మాత్రం పారాచూట్ లో వస్తాడు అంటూ మరో స్టేటస్ పెట్టారు. ఇది కూడా నేరుగా బండి రమేశ్ టార్గెట్ గానే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. నామినేషన్ల సమయంలో Brs పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన బండి రమేశ్.. ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని కూకట్ పల్లిలో పోటీ చేశారు. దీన్ని ప్రశ్నిస్తూనే పారాచూట్ లీడర్ అంటూ శేరి సతీష్ రెడ్డి విమర్శలు చేశారు. ఇది కూడా కూకట్ పల్లి కాంగ్రెస్ లో రచ్చ రాజేస్తోంది. శేరి సతీష్ రెడ్డి అనుచరులు బండి రమేశ్ పై సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

బండి రమేశ్ ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని సతీష్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ప్రతి డివిజన్ లో నలుగురైదురు లీడర్లను పెట్టుకుని.. పార్టీ కోసం శ్రమిస్తున్న నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక నేతలను బండి రమేశ్ టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అల్లాపూర్, బాలానగర్, మూసాపేట డివిజన్లలో పార్టీ కోసం సొంతగా డబ్బులు ఖర్చు చేస్తున్న బలమైన రెడ్డి నేతలు ఉన్నా.. బండి రమేశ్ వాళ్లను కావాలనే దూరం పెడుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపోతున్నారు.

బండి రమేశ్ చేతకానితనం వల్లే కూకట్ పల్లిలో కాంగ్రెస్ బలహీనంగా మారిందనే ఆరోపణలు పార్టీ కేడర్ నుంచే వస్తున్నాయి. అధికారంలో ఉన్నా గత రెండేళ్లలో ఇతర పార్టీల నుంచి ఒక్కరంటే ఒక్కరు కూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. ఒక్క కూకట్ పల్లిలో మాత్రమే జీరోగా నిలిచిందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూకట్పల్లి నియోజకవర్గంలో వివిధ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు మీద పది నుంచి 14 కేసులు పెట్టారని.. బండి రమేశే సొంత పార్టీ నేతలపై కేసులు పెట్టించారని సతీష్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. మొత్తంగా బండి రమేశ్, శేరి సతీష్ రెడ్డి మధ్య సాగుతున్న రచ్చ కూకట్ పల్లి కాంగ్రెస్ లో దుమారం రేపుతోంది. ఇది ఎటువైపు దారి తీస్తుందోనన్న చర్చ సాగుతోంది.

Back to top button