
మేడం వచ్చారని తెగ సంతోషపడ్డారు.. మంచి రోజులు వచ్చాయి… ఇక అంతా మేలు జరుగుతుందని ఆశ పడ్డారు. కట్ చేస్తే… అంతా కామనే. పార్టీలో ఏ మార్పు కనిపించడంలేదు సరికదా… పీటముడులు పడుతూనే ఉన్నాయి. మరి… కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మార్క్ చూపేదెన్నడు…? అసలు ఆమె ఎందుకంత సైలెంట్ అయ్యారు…? కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది…? మీనాక్షి నటరాజన్ పనికి అడ్డుపడుతున్నది ఎవరు..?
ఎవరు వచ్చినా… మార్పు తేవాలని ఎంత ప్రయత్నించినా.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం మార్పు రానేరాదని మరోసారి రుజువైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ వచ్చాక.. పార్టీలో మార్పు వస్తుందని… కష్టపడి పనిచేసే వాళ్లకు ప్రాధాన్యత దక్కుతుందని ద్వితీయ శ్రేణి నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఆమె నిరాడంబరం, పనితీరు, నాయకత్వ లక్షణాలు చూసి నిజంగానే పార్టీకి మంచి రోజులు వచ్చాయని సంబరపడ్డారు. కానీ… ఆ ఆశలు… ఆశలుగానే మిగిలిపోయాయి. పార్టీలో… మార్పు మచ్చుకైనా కనిపించడంలేదు. వచ్చినా కొత్తగా… అన్ని విషయాలపై స్పీడ్గా స్పందించిన మీనాక్షి నటరాజన్… ఆ తర్వాత చాలా సైలెంట్ అయ్యారు. ఏ విషయంపైనా పెద్దగా రియాక్ట్ కావడంలేదు. HCU విషయంలో పెద్ద రచ్చే జరుగుతున్నా… మీనాక్షి నటరాజన్ మాత్రం నోరుమెదపలేదు. దీనికి కారణం ఏంటి…? అన్న చర్చ జరుగుతోంది.
Also Read : కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా… అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. పదవులు ఆశించేవారు లెక్కకుమించి ఉండటంతో.. ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితి ఆ పార్టీది. పదవులు ఇస్తే ఏమవుతుందో… ఇవ్వకపోతే ఏమవుతుందో అన్న మీమాంశలో పడి… అసలు నామినేటెడ్ పదవుల భర్తీ జోలికే పోవడం లేదు. అంతేకాదు మంత్రివర్గ విస్తరణ చేద్దామన్నా… మాకంటే మాకు అంటూ ఆశావహులు ఢిల్లీ వరకు క్యూకడుతున్నారు. దీంతో… కేబినెట్ విస్తరణకూ బ్రేక్ పడింది. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చినా… పదవులు రాకపోవడంతో… పార్టీ నేతలతో నిరాశలో ఉన్నారు.