
తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేటలో హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. విశ్వాస్ బుద్ధిమాంద్యులు, వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో నిర్వహించిన ఓ సాదాసీదా జన్మదిన వేడుక భావోద్వేగ క్షణాలకు వేదికైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి ఆర్.గాంధీ కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారిని కూడా కదిలించింది.
ఈ పాఠశాలలో నివసిస్తున్న జాఫర్ అనే యువకుడు పుట్టుకతోనే మెదడులో లోపంతో బాధపడుతున్నాడు. మానసిక ఎదుగుదల సక్రమంగా జరగకపోవడంతో అతని జీవితం ప్రత్యేక సంరక్షణపై ఆధారపడింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు చికిత్సకు అనుకూలంగా లేకపోవడంతో, దాదాపు 29 ఏళ్ల క్రితం తల్లిదండ్రులు అతన్ని ఈ ప్రత్యేక పాఠశాలలో చేర్పించారు. అప్పటి నుంచి పాఠశాల యాజమాన్యం అతన్ని తమ సొంత పిల్లలాగే చూసుకుంటూ వస్తోంది.
జాఫర్ 30వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో సరళమైన వేడుక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆర్.గాంధీతో పాటు ఆయన సతీమణి కమల గాంధీ, కుమారుడు వినోద్ గాంధీ హాజరయ్యారు. మంత్రి స్వయంగా కేక్ కట్ చేసి జాఫర్కు శుభాకాంక్షలు తెలిపారు. అక్కడున్న విద్యార్థులు, సిబ్బంది కూడా ఆనందంగా వేడుకలో పాల్గొన్నారు.
అయితే కార్యక్రమం సందర్భంగా జాఫర్ తల్లి నూర్జహాన్ తన కుమారుడి జీవితగాథను వివరించడంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి, చిన్ననాటి నుంచి ఎదుర్కొన్న కష్టాలు, కుటుంబ పరిస్థితులు అన్నింటిని వివరించడంతో మంత్రి ఆర్.గాంధీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె మాటలు విన్న వెంటనే ఆయన కళ్లలో నీళ్లు తెరపడ్డాయి. ఆ దృశ్యం అక్కడున్న వారిని కూడా కదిలించింది.
ALSO READ: రామ్ చరణ్- ఉపాసనలకు కవల పిల్లలు.. పేర్లు ఇవే









