
-
238 ఇందిరమ్మ గృహాలకు మంజూరు పత్రాల పంపిణీ
గండిపేట్, (క్రైం మిర్రర్): రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టి. ప్రకాష్గౌడ్ తెలిపారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో మంజూరైన 238 ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు సోమవారం కోకాపేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదల కష్టసుఖాలను తెలుసుకొని వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. “ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు ఉచితంగా మంజూరు చేయడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి,” అని వెల్లడించారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ జీవన ప్రమాణాన్ని మెరుగుపర్చుకోవాలని సూచించారు.
మున్సిపాలిటీ పరిధిలోని అధికారులు శ్రమతో పని చేస్తున్నారని పేర్కొంటూ, వారికి ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు. “పని చేస్తున్న అధికారులపై విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు,” అని అన్నారు. ఇంకా ఇళ్లు లభించని అర్హులైన వారు ధరఖాస్తు చేసుకుంటే, వారికి కూడా మంజూరు అయ్యేలా కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో నార్సింగి మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వేణుగౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ముంగి జైపాల్రెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు అశోక్యాదవ్, మాజీ కౌన్సిలర్లు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.