
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ: పుట్టిన గ్రామాన్ని మరిచిపోకుండా, సేవా స్పృహతో ఋణం తీర్చుకుంటూ ఆదర్శ దంపతులుగా నిలిచారు ఇందుర్తి మేటిచందాపురం గ్రామానికి చెందిన కుంభం ప్రీతి శ్రీనివాస్ రెడ్డి దంపతులు. అమెరికాలో స్థిరపడిన ఈ పుణ్యదంపతులు, విజయవంతమైన జీవితం సాగిస్తున్నప్పటికీ, గ్రామానికి తమ వంతు సేవ చేయాలనే అభిమతంతో అనేక కార్యక్రమాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు.
సమీపంలో నిర్మితమవుతున్న గ్రామ బొడ్రాయి (నాభి శిల) దేవాలయ నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం, అంతంపేట గ్రామంలోని శివాలయం నిర్మాణానికి రూ.15 లక్షల సహాయం అందించి, తమ గ్రామాల అభివృద్ధికి తోడ్పాటుగా నిలిచారు. గ్రామ ప్రజలు వీరి ఔదార్యాన్ని అభినందిస్తూ, వీరు చూపిన భక్తి, మానవత్వ దృక్పథం ప్రజల మనసుల్ని గెలుచుకుంటోంది.
గ్రామ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, స్థానిక నాయకులు అయితగోని యాదగిరి గౌడ్ తరుపున గ్రామానికి విశ్వసనీయ మద్దతుగా నిలుస్తున్న ఈ దంపతులు, ఎన్నో సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిల చదువు, దేవాలయాల అభివృద్ధి, పల్లె లో వెలుగులు నింపే ప్రయత్నాలలో వారిది ప్రత్యేక స్థానం. “ఉన్నదాంట్లో పంచుకోవాలన్న ఆలోచనే నిజమైన భక్తి” అని అభిప్రాయపడుతున్న గ్రామ పెద్దలు, వీరు తీరుస్తున్న ఊరు ఋణాన్ని చూసి గ్రామ యువతకు కూడా స్ఫూర్తిగా నిలుస్తారని అంటున్నారు.