తాండూరు, క్రైమ్ మిర్రర్: రైతులకు శాశ్వత పరిష్కారం భూ భారతి చట్టం ద్వారానే జరుగుతుందని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం, గిర్మాపూర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి–సమగ్ర భూసర్వే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రక్రియను స్వయంగా పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం, ధరణి స్థానంలో భూ భారతి వ్యవస్థను తీసుకొచ్చామని. గత పాలకుల నిర్లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థ గందరగోళానికి గురైందని అన్నారు.రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో అధికారులు గ్రామాలకే వచ్చి సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారని చెప్పారు. సర్వే సమయంలో ఎదురయ్యే సమస్యలను రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.భూ భారతి చట్టం ద్వారా రైతులకు పారదర్శకమైన, సుస్థిరమైన భూ రికార్డు వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
