
హైదరాబాద్, (క్రైమ్ మిర్రర్): రామంతాపూర్లో చోటుచేసుకున్న విద్యుత్ ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రమాద స్థలాన్ని సందర్శించేందుకు వచ్చిన విద్యుత్ శాఖ సీఎండీని స్థానికులు అడ్డుకున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని వారు ఆరోపించారు. ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. “విద్యుత్ శాఖ డౌన్డౌన్” అంటూ నినాదాలు చేశారు. దీంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
నిరసన ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించిన స్థానికులను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో, వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రామంతాపూర్ మెయిన్రోడ్పై స్థానికులు ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విద్యుత్ శాఖ జవాబు చెప్పాల్సిందే: స్థానికులు మాట్లాడుతూ, గతంలో కూడా ఇలాంటే ఘటనలు జరిగాయని, కానీ ఎప్పటికీ నిర్లక్ష్యపూరిత విధానమే కొనసాగుతోందని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. విద్యుత్ శాఖ తక్షణమే స్పష్టత ఇవ్వాలని, బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్థానికులు హెచ్చరిస్తున్నారు.