నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
పరీక్షలు రాయనున్న 37వేల మంది విద్యార్థులు
నిజామాబాద్,క్రైమ్ మిర్రర్: ఉమ్మడి జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అధికారులు ఏర్పాట్లను పూ్ర్తి చేశారు. కాగా విద్యార్థి భవిష్యత్తుకు తొలి మెట్టుగా భావించే టెన్త్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమై ఏప్రిల్ 13 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగనున్నాయి.
వార్షిక పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో 37 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. నిజామాబాద్ జిల్లాలో 12,244 మంది బాలురు, 12,155 మంది బాలికలు హాజరు కానున్నారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ,ప్రయివేటు , ఎయిడెడ్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న 6,451 మంది బాలురు, 6,703 మంది బాలికలు కలిపి మొత్తం 13,154 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షల విధానంలో ఈ సారి మార్పులు చోటు చేసుకున్నాయి. గతేడాది వరకు వార్షిక పరీక్షలు ఆదివారాలు మినహా వరుసగా నిర్వహించేవారు. ఈసారి మాత్రం ఒక్కో పరీక్షకు మధ్య 3 నుంచి 5 రోజుల వరకు గడువు పెంచారు.మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 23న ఇంగ్లిష్, 28న మ్యాథ్స్, ఏప్రిల్ 2న ఫిజిక్స్, 7న బయాలజీ, 13 సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగనున్నాయి.
15, 16 తేదీల్లో ఒకేషనల్ కోర్సు పరీక్షలు నిర్వహించనున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షల నిమిత్తం 24 గంటల పాటు పని చేసేలా కంట్రోల్ నంబర్ (కామారెడ్డి`99596 70118, నిజామాబాద్`90302 82993) ఏర్పాటు చేశారు.పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు డిఇవో తెలిపారు. మాస్ కాపీయింగ్ జరగకుండా చూస్తున్నాం. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేసామని, పరీక్ష సమయానికి గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
