తెలంగాణ

పక్కకు ఒరిగిన 5 అంతస్తుల భవనం.. మాదాపూర్‌లో హై టెన్షన్

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని సిద్దిఖీనగర్‌లో నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగిన ఘటన కలకలం రేపింది. వసుకుల లక్ష్మణ్‌ అనే వ్యక్తి ప్లాట్‌ నం. 1639లో 70 గజాల స్థలంలో జీప్లస్‌ ఫోర్‌ భవనాన్ని నిర్మిచారు. ఫ్లోర్‌కు రెండు పోర్షన్ల చొప్పున నాలుగు ఫ్లోర్లు నిర్మాణం చేశారు. ఆ భవనంలో మొత్తం 48 మంది అద్దెకు ఉంటున్నారు. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో గోడ కూలినట్లు శబ్దం వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో పెద్దగా శబ్దం వచ్చి భవనం ఒరిగిపోతోతుండటంతో..స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బిల్డింగ్‌లో ఉన్న వాలంతా కిందకు వచ్చేశారు. మూడో అంతస్తులో ఉండే సాదిక్‌ హుస్సేన్‌ కిందికి దూకగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈలోగా అందరూ కిందకు వచ్చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే భవనం నిర్మించినట్లు తెలుస్తోంది.

ఈ భవనం పక్కనే ఉండే 1605, 1638 ప్లాట్లను కలిపి భవనం నిర్మించేందుకు పిల్లర్లు వేయడానికి గుంతలు తవ్వారు. వీటితో భవనానికి ఇబ్బంది వస్తుందని ఈ భవన యజమాని వారిని హెచ్చరించారు. అయినా వారు వినలేదు. దీనివల్లే ఈ భవనం పరిస్థితి ఇలా మారిందని ఆరోపించారు. ఘటనా స్థలాన్ని జీహెచ్‌ఎంసీ వెస్ట్‌జోన్‌ జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి, శేరిలింగంపల్లి టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ వెంకటరమణ, మాదాపూర్‌ ఏసీపీ శ్రీకాంత్, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది పరిశీలించారు.

పక్కకు ఒరిగిన భవనం చుట్టూ ఉండే పది భవనాల్లో నివాసం ఉండేవారిని ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించి వేరేచోటికి తరలించారు. ఈ భవనం ముందు కేవలం పదిఫీట్ల రోడ్డు మాత్రమే ఉంది. భవనాన్ని ఇంజనీర్లు పరిశీలించి నాణ్యతను నిర్ణయిస్తారని, వారి నివేదిక ఆధారంగా ఒరిగిన భవనాన్ని తొలగిస్తామని ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు. అలాగే ఈ భవనం వెనుక లోతైన గుంతలు తీసిన బిల్డర్‌పైనా చర్యలు తీసుకుంటామన్నారు.

Back to top button