Telangana: మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి ఎవరు అర్హులు..? ఎవరు అనర్హులంటే?

Telangana: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడంతో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Telangana: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడంతో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ఎన్నికల సంఘం స్పష్టమైన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు కొత్త పాలకవర్గాలు ఎన్నిక కానున్నాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం ఈ ఎన్నికల పరిధిలోకి రాకపోవడం గమనార్హం.

ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతోనే రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చురుకుగా కదలికలు మొదలుపెట్టారు. మున్సిపల్ పాలనపై ప్రత్యక్ష ప్రభావం చూపే ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమీకరణలు, పొత్తులపై చర్చలు వేగంగా సాగుతున్నాయి. అధికార యంత్రాంగం కూడా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేసింది.

నామినేషన్ల స్వీకరణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 28 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన అనంతరం ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. ఆ తర్వాత తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు అర్హతలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. పోటీ చేసే వారు భారత పౌరులై ఉండడంతో పాటు కనీసం 21 సంవత్సరాల వయస్సు పూర్తి చేసి ఉండాలి. కార్పొరేషన్ అభ్యర్థులు ఆ కార్పొరేషన్ పరిధిలోని ఏదైనా వార్డులో ఓటరుగా నమోదు అయి ఉండాలి. మున్సిపాలిటీ అభ్యర్థులు సంబంధిత మున్సిపాలిటీ పరిధిలో ఓటరుగా ఉండటం తప్పనిసరి. ప్రభుత్వ కాంట్రాక్టర్లు, లాభదాయక పదవుల్లో ఉన్న వ్యక్తులు ఎన్నికలకు అనర్హులుగా పరిగణిస్తారు.

గత ఎన్నికల్లో ఖర్చుల వివరాలు సమర్పించని కారణంగా అనర్హతకు గురైన వారు, అలాగే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సేవల నుంచి తొలగించబడిన వారు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయలేరు. దివాలా ప్రకటించబడిన వ్యక్తులకు పోటీ చేసే హక్కు ఉండదు. ఈ నిబంధనలన్నింటినీ కచ్చితంగా అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు అవసరమైన పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. ఎన్నికల అధికారి నుంచి పొందిన నామినేషన్ ఫారం, ఆస్తులు, అప్పులు, ఆదాయాలు, క్రిమినల్ కేసుల వివరాలతో కూడిన అఫిడవిట్ ఇవ్వాలి. ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు ప్రతులు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్ స్థానాల్లో పోటీ చేసే వారు రెవెన్యూ శాఖకు చెందిన డిప్యూటీ ఎమ్మార్వో స్థాయి అధికారి ఎదుట ఇచ్చిన డిక్లరేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు బీ ఫామ్‌ను తీసుకొని రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. స్వతంత్ర అభ్యర్థులకు సంబంధిత వార్డులోని కనీసం 10 మంది ఓటర్ల ప్రతిపాదన తప్పనిసరి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఎన్నికల ఖర్చులపై కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కఠిన ఆంక్షలు విధించింది. కార్పొరేషన్ అభ్యర్థులు గరిష్టంగా రూ.10 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయాలి. గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అభ్యర్థులకు రూ.5 లక్షల వ్యయ పరిమితి నిర్ణయించారు. నామినేషన్‌కు ముందే ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి, ప్రచార ఖర్చులన్నీ అదే ఖాతా ద్వారా జరగాలి. డిపాజిట్ విషయానికి వస్తే మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.1,250, ఇతరులకు రూ.2,500గా నిర్ణయించారు. కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2,500, ఇతరులకు రూ.5,000 డిపాజిట్ చెల్లించాలి. రిజర్వ్ స్థానాల్లో పోటీ చేసే వారు కుల ధృవీకరణ పత్రాన్ని జత చేయడం తప్పనిసరి.

ALSO READ: ప్రియుడికి వీడియో కాల్ చేసి.. మహిళా న్యాయవాది ఆత్మహత్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button