Telangana: తెలంగాణలో మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఇప్పుడు వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో “హెల్త్ మిషన్ 100” కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తోంది. మహిళల ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసి, భవిష్యత్ వైద్య విధానాల రూపకల్పనకు డేటా సేకరించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
హెల్త్ మిషన్ 100కి శ్రీకారం..
ఈ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. నాలుగు దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ముందుగా డ్వాక్రా (స్వయం సహాయక సంఘాలు – SHGs) మహిళలతో ప్రారంభించి, అనంతరం రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. దీని ద్వారా మహిళల ఆరోగ్య స్థితి, జీవనశైలి, పోషకాహార అలవాట్లు, వ్యాధుల ప్రబలత వంటి అంశాలపై సమగ్ర నివేదిక ప్రభుత్వం వద్దకు చేరుతుంది.
30 రకాల ఆరోగ్య పరీక్షలు..
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇవి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సేవల ద్వారా చేపడతారు. రాష్ట్రంలో సుమారు 42 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ముందుగా పరీక్షలు నిర్వహించి, వారి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తారు. తద్వారా సాధారణంగా ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధులను గుర్తించి, లక్ష్యిత చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
మహిళల్లో ఆరోగ్య సమస్యలు..
తెలంగాణలో అనేక మహిళలు రక్తహీనత (అనీమియా) సమస్యతో బాధపడుతున్నట్లు ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. అదనంగా రోగనిరోధక శక్తి తగ్గడం, హార్మోన్ల అసమతుల్యత వల్ల థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్, కిడ్నీ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, లివర్ సమస్యలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిపై స్పష్టమైన డేటా లభిస్తే, లక్ష్యిత వైద్య విధానాలు రూపొందించి వ్యాధులను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
100 రోజుల కార్యాచరణ ప్రణాళిక..
మార్చి 2న ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం జూన్ 9 వరకు కొనసాగుతుంది.
* మొదటి దశలో మహిళలు
* తర్వాత చిన్నారులు
* అనంతరం వృద్ధులు
* చివరిగా బలహీన వర్గాలపై ఫోకస్ ఉంటుంది
పరీక్షల అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHCs) నిపుణులైన వైద్యుల సేవలు అందిస్తారు. 33 ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు కంటి చూపు పరీక్షలు చేస్తారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో టీకాల కార్యక్రమం చేపడతారు.
క్యాన్సర్పై ప్రత్యేక దృష్టి..
డయాబెటిస్, బీపీతో పాటు క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ వ్యాధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పరీక్షల ద్వారా వివరాలు సేకరించి ప్రత్యేక రిజిస్ట్రీ నిర్వహించనున్నారు. దీని ఆధారంగా మహిళల్లో ఏ రకాల క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నాయో తెలుసుకుని, నివారణ చర్యలు, చికిత్సా విధానాలపై నిర్ణయాలు తీసుకుంటారు.
భవిష్యత్ వైద్య విధానాలకు బాట..
100 రోజులపాటు నిర్వహించే ఈ సమగ్ర ఆరోగ్య సర్వే ద్వారా రాష్ట్రంలో వ్యాధుల ప్రబలత, అవసరమైన పరీక్షలు, మెడికల్ మౌలిక వసతుల లోపాలు వంటి అంశాలు స్పష్టమవుతాయి. అందుకు అనుగుణంగా ప్రభుత్వం భవిష్యత్ ఆరోగ్య విధానాలు, వైద్య సదుపాయాల విస్తరణ, పోషకాహార కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించనుంది.
ALSO READ: ఇవాళ తెలంగాణకు రాహుల్ గాంధీ రాక
