చింతపల్లి (క్రైమ్ మిర్రర్):- అక్షరాలు నేర్పి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన, ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. కన్న బిడ్డలా చూసుకోవాల్సిన విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి, గురుశిష్యుల బంధానికి కళంకం తెచ్చాడు.
ఈ ఘటన మాల్ గోడుకొండ్ల, విటి నగర్ ప్రైమరీ స్కూల్లో కలకలం రేపింది. మాల్ గోడుకొండ్ల విటి నగర్ ప్రాథమిక పాఠశాలలో, 4వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల, సదరు ఉపాధ్యాయుడు గత కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం.
తాజాగా, సదరు ఉపాధ్యాయుడి ప్రవర్తన, హద్దులు దాటడంతో విషయం బయటకు పొక్కింది. బాధిత విద్యార్థిని ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. పాఠశాలకు చేరుకున్న గ్రామస్తులు సదరు ఉపాధ్యాయుడిని నిలదీశారు.
అతడి సమాధానంతో సంతృప్తి చెందని జనం, అక్కడికక్కడే అతడికి దేహశుద్ధి చేశారు. విద్య నేర్పే దేవాలయం వంటి పాఠశాలలో, ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.





