తెలంగాణ

మర్రిగూడ పీఎస్‌లో ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

  • పోలీస్ స్టేషన్‌ ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

  • కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి

  • సమగ్ర విచారణతో బాధితులకు న్యాయం చేయాలి

  • అలసత్వం వహిస్తే సహించేది లేదు: శరత్‌చంద్ర

క్రైమ్‌మిర్రర్‌, నల్లగొండ: దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని మర్రిగూడ పోలీస్ స్టేషన్‌ను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది పనితీరు, పీఎస్‌ పరిసరాలు, స్థితిగతుల గురించి ఎస్ఐ కృష్ణారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్‌, ఎస్‌హెచ్‌వో రూమ్ తదితర ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

పీఎస్‌ పరిధిలో నమోదవుతున్న, నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ రికార్డులు తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని సూచించారు. దర్యాప్తులో ఉన్న కేసులను సమగ్ర విచారణ చేపట్టి, చట్టప్రకారం శిక్షపడే విధంగా కృషి చేయాలన్నారు. ప్రజా ఫిర్యాదులలో ఎలాంటి జాప్యం చేయొద్దన్నారు. బాధితుల సమస్యల పట్ల తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో వుండాలని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు కృషి చేయాలన్నారు. బ్లూ కోర్ట్‌ , పెట్రోకార్ డ్యూటీలో ఉన్నప్పుడు, డయల్ 100 కి తక్షణమే స్పందించాలన్నారు. ఘటనా స్థలానికి చేరుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. రౌడీ షీటర్లపై కన్నేసి ఉంచాలన్నారు. పీఎస్‌లో సీసీటీవీల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు.

సైబర్ క్రైమ్, డయల్ 100 వినియోగంపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టాలని, గంజాయి, అక్రమ ఇసుక రవాణా, రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, జూదం వంటి వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు. గతంలో గంజాయి కేసులలో నిందితులుగా ఉన్న వారిపై, నిఘా ఉంచాలని, గంజాయి తాగే వారిని, వారికి సరఫరా చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి, వారి సమస్యలు పరిష్కరించాలని ఎస్ఐని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక (ఐపీఎస్), ఎస్ఐ కృష్ణారెడ్డి, స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

Read Also: 

  1. ఇకపై బెట్టింగ్‌ యాప్స్‌కి ప్రమోషన్‌ చేయను: ప్రకాశ్‌రాజ్‌
  2. భారత్‌పై అమెరికా టారిఫ్‌ బాంబ్‌
Back to top button