Doctor Patient Fight: ఆస్పత్రిలో డిష్యుం డిష్యుం, కొట్టుకున్న పేషంట్, డాక్టర్!

ఆస్పత్రిలో పేషంట్, డాక్టర్ కొట్లాడుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ బెడ్ మీద పడి భీకరంగా తన్నుకున్నారు.

Shimla hospital Doctor Patient Fight: హిమాచల్ ప్రదేశ్‌లోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పేషంట్, డాక్టర్ మధ్య భీకర పోరు చోటుచేసుకుంది. ఇద్దరూ బెడ్ మీద పడి తీవ్రంగా కొట్టుకున్నారు. కొన్ని నిమిషాల పాటు ఆ వార్డు మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ స్టేజ్‌ను తలపించింది. సోమవారం ఈఘటన జరిగింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

షిమ్లాకు చెందిన అర్జున్ పన్వర్ అనే వ్యక్తి ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది తలెత్తటంతో ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి వెళ్లాడు. చికిత్స అనంతరం వార్డులోని బెడ్‌పై పడుకుని ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఓ యువ డాక్టర్ అక్కడికి వచ్చాడు. అర్జున్‌ను నువ్వు అని సంబంధిస్తూ మాట్లాడాడు. తనను నువ్వు అని పిలవటం అర్జున్‌కు నచ్చలేదు. డాక్టర్‌తో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా మారిపోయింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం మొదలెట్టారు. డాక్టర్ చేతులతో దాడి చేస్తుంటే.. అర్జున్ కాళ్లతో దాడి చేశాడు. ఆ వార్డు మొత్తం ఫైటింగ్ రింగ్ గా మారిపోయింది. అక్కడున్న వారు ఇద్దరినీ గొడవపడకుండా ఆపారు.

డాక్టర్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

డాక్టర్ దాడి చేయటంపై అర్జున్, అతడి తరఫు వారు ధర్నాకు దిగారు. డాక్టర్ క్షమాపణ చెప్పాలంటూ నిరసనలు తెలియజేశారు. ఆస్పత్రి అధికారులు ఈ సంఘటనపై స్పందించారు. డాక్టర్ ను సస్పెండ్ చేశారు. విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేశారు. అంతేకాదు.. డాక్టర్‌పై పోలీస్ కేసు సైతం నమోదు అయింది. ఈ సంఘటనపై అర్జున్ మాట్లాడుతూ.. “నేను అప్పుడే బ్రోంకోస్కోపీ చేయించుకున్నాను. ఊపిరి తీసుకోవటం ఇబ్బందిగా మారింది. ఆక్సిజన్ కావాలని అడిగాను. డాక్టర్ నా అడ్మీషన్ స్టేటస్ గురించి అడిగాడు. నేను కొంచెం మర్యాదగా మాట్లాడమని అన్నాను. అంతే.. అతడు నాతో గొడవపెట్టుకున్నాడు. తర్వాత నాపై దాడి చేశాడు” అని చెప్పుకొచ్చాడు.

Back to top button