అంతర్జాతీయం

అమెరికా చర్యలకు తగిన జవాబిస్తాం.. సుంకాల పెంపుపై భారత్ ఆగ్రహం!

India On Trump Tariff:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ పై మరోసారి అధిక సుంకాల విధించడంపై భారత్ స్పందించింది. ఇప్పటికే 25 శాతం టారిఫ్ విధించగా, ఇప్పుడు అదనంగా మరో 25 శాతం టారిఫ్‌ లను విధించారు. అయితే ట్రాంప్ విధిస్తున్న సుంకాలపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది. రష్యా చమురు దిగుమతిని కొనసాగించడానికి ప్రతిస్పందనగా అదనపు సుంకాలను విధించాలనే అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ చర్య అన్యాయం, అసమంజసమైనదని అభివర్ణించింది. త్వరలోనే.. అమెరికా చర్యలకు ధీటుగా భారత్ జవాబిస్తుందని తేల్చి చెప్పింది.

దేశ ప్రయోజనాల కోసమే ఆయిల్ కొనుగోలు

భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను లక్ష్యంగా చేసుకుని అమెరికా అడ్డగోలుగా వ్యవహరించడం సరికాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ ప్రయోజనాల కోసమే ఆయిల్ కొనుగోలు చేస్తున్నట్లు భారత్ తన వైఖరిని అమెరికాకు స్పష్టంగా చెప్పినప్పటికీ,  చమురు దిగుమతులను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఇలాంటి చర్యలకు పాల్పడటం దుర్మార్గమని అభిప్రాయపడింది. తాజాగా భారత్‌పై 25 శాతం అదనపు టారిఫ్‌లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు గాను 25 శాతం మేర భారత్‌పై ఆయన టారిఫ్‌ను విధించారు. దీంతో భారత్‌పై మొత్తం 50 శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాకు సరైన బుద్ధి చెప్పాలనే ఆలోచనలో భారత్ ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: మరో 25 శాతం టారిఫ్ పెంపు, భారత్ పై ట్రంప్ అక్కసు!

Back to top button