
క్రైమ్ మిర్రర్, నల్లగొండ ఇన్వెస్టిగేషన్ బ్యూరో : నిన్నటి అమానవీయ నేరానికి న్యాయం అందించే దిశగా నల్లగొండ పోలీసులు వేగంగా కదులుతున్నారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, మరణానికి కారణమైన ప్రధాన నిందితులు గడ్డం కృష్ణ మరియు అతని సహచరుడు బచ్చలకూరి మధును అదుపులోకి తీసుకున్న పోలీసులు, మంగళవారం రాత్రి వారిని కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించారు. నిందితులను పట్టుకున్న అనంతరం పోలీసులు వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా టూ టౌన్ సీఐ రాఘవరావు, ఎస్ఐ వై. సైదులు ఆధ్వర్యంలో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకువచ్చిన విధానం, ఆధారాల సేకరణ పద్ధతి, సాంకేతిక పరిశీలనల వివరాలను డీఎస్పీ కే. శివరాం రెడ్డి సమీక్షించారు.
పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం, నిందితులు నేరానికి ఉపయోగించిన మోటార్సైకిల్, మధు ఆటో, అలాగే ఇన్స్టాగ్రామ్ చాట్ల స్క్రీన్షాట్లు, ఫోన్ కాల్ రికార్డులు, సీసీ కెమెరా దృశ్యాలు వంటి కీలక సాక్ష్యాలను సేకరించారు. ఈ ఆధారాలను ఫోరెన్సిక్ విభాగానికి పంపినట్లు పోలీసులు తెలిపారు. డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ కేసు పట్ల ప్రజల్లో ఉన్న ఆవేదన మాకు తెలుసు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే అన్ని సాంకేతిక ఆధారాలు సేకరించబడ్డాయి. ఈ కేసు ఛార్జ్షీట్ను అత్యంత త్వరగా కోర్టులో దాఖలు చేస్తాం అని పేర్కొన్నారు.
Also Read : నల్లగొండ వైద్యుల నిర్లక్ష్యం.! – గర్భిణి గర్భంలోనే పసికందు మృతి
క్రైమ్ మిర్రర్ ప్రతినిధులు సంఘటన స్థలాన్ని పరిశీలించినప్పుడు, పోలీసులు ఇప్పటికే ఆ ప్రాంతాన్ని సీజ్ చేసి, ఫోరెన్సిక్ బృందంతో కలిసి వివరాల సేకరణ జరిపినట్లు గుర్తించారు. రూమ్లోని బెడ్ షీట్లు, బట్టలు, తాళాలు, అలాగే నిందితుల వేలిముద్రలు సేకరించబడ్డాయి. నిందితులు ఇద్దరూ నల్లగొండలోని జ్యుడీషియల్ రిమాండ్ హోమ్కు తరలించబడ్డారు. విచారణలో ప్రధాన నిందితుడు గడ్డం కృష్ణ తన నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే సహచరుడు మధు తనకు ఏమి తెలియదు అని చెప్పినా, కాల్ రికార్డులు, చాటింగ్ ఆధారాలు అతని ప్రమేయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ కేసు పర్యవేక్షణను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ స్వయంగా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఇది ఒక్క కుటుంబం బాధ కాదు, సమాజాన్ని కుదిపే నేరం. పోలీసులు మాత్రమే కాదు, కోర్టు కూడా ఈ కేసును త్వరితగతిన పూర్తి చేస్తుందనే నమ్మకం ఉంది. అని స్పష్టం చేశారు.
క్రైమ్ మిర్రర్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం, ఈ కేసు విచారణలో పోలీసులు సాంకేతికంగా బలమైన ఆధారాలను సేకరించడంతో, కోర్టులో ఇది త్వరితగతిన పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నిందితులు ప్లాన్ చేసిన విధానం, బాధితురాలిని ప్రలోభపెట్టి నగరానికి తీసుకురావడం, మరియు ఆన్లైన్ కమ్యూనికేషన్ ఆధారాలు ఈ కేసులో కీలకమైనవిగా మారాయి. ఈ ఘటన నల్లగొండ ప్రజలలో భయంతో పాటు ఆవేదనను కూడా పెంచింది. సోషల్ మీడియా ద్వారా మోసం చేసే నేరగాళ్లకు కఠిన శిక్షలు విధించకపోతే ఇలాంటి ఘటనలు ఆగవు అని సామాన్య ప్రజలు అంటున్నారు. డీఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు సాక్ష్యాలను కోర్టుకు బలంగా సమర్పించే దిశగా కృషి చేస్తున్నారు.