
నల్లగొండ, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి: “మేము కూడా మనుషులమే కదా… మా కోరికను ఎవరూ పట్టించుకోకపోతే ఎందుకు ఈ పథకాలు?” నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన గుర్రం ముత్యాలు అశ్రునయనాలతో ఇలా అంటోంది. గత 30 ఏళ్లుగా ఓ తాటాకుల గుడిసెలో జీవిస్తున్న ముత్యాలు కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ఓ గుప్పెడి ఆశ. కానీ ప్రభుత్వ ప్రకటనలు వేరే, నిజాలు వేరేగా మిగిలిపోయాయి. “ఇల్లు వస్తుందనే ఆశతో గడిపిన రోజులు ఒడిదుడుకులే. ఇప్పుడు లబ్ధిదారుల జాబితాలో మా పేరు లేదు అంటున్నారు,” అంటూ ఆమె భర్త పాండు ఆవేదన వ్యక్తం చేస్తారు.
“అధికారులూ లీడర్లూ ఓడిపోకుండా మమ్మల్ని మధ్యలో వదిలేశారు” అని వాపోతున్న ఈ కుటుంబానికి ఎటూ ఆశకు జాడ కనిపించడం లేదు. “జాబితాలో పేరు లేదని అధికారులే అంటారు, నాయకులను అడిగితే ‘ఫైల్ పంపలేదు’ అంటారు… మాకేమైనా మోక్షముందా?” అంటూ ఆవేశం వ్యక్తం చేశారు పాండు.
చిన్న తాటాకుల గుడిసెలో జీవనాన్ని గడుపుతున్న కుటుంబానికి… తమ కష్టాలు ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆవేదన తీర్చలేని గాయంలా మారిందని గ్రామస్థులు చెబుతున్నారు. ముత్యాలు కుమారుడు, అమ్మమ్మ తాతలతో కలిసి ఒక్క గదిలో జీవితం సాగిస్తున్నారని, ఒకరికి ఒక్కడు నిద్రించే చోటుకూడా సరిగా లేదని బాధితురాలు వివరించింది.
“మాకు నేలదొరకదు, గోడదొరకదు. కనీసం అధికారుల మనసైనా లభించాలి” అంటూ తలదించుకుని మాట్లాడిన ముత్యాలు, చివరగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయం కోరుతూ – “మీ మాటల్లో నిజాయితీ ఉంది.. ఇప్పుడు మా న్యాయాన్ని మీరు లబ్ధిగా చేయండి” అంటూ వేడుకుంది.