Privacy Row: గోప్యతా చట్టం విషయంలో రాజీ పడేదే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాట్సాప్ మాతృసంస్థ, టెక్ దిగ్గజం.. ‘మెటా’పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. భారత దేశ చట్టాలను పాటించలేకపోతే.. దేశం విడిచి వెళ్లిపోవచ్చని తేల్చిచెప్పింది. గోప్యతా చట్టంతో ఆడుకోలేరని.. డేటాలోని ఒక్క అంకెను కూడా పంచుకునేందుకు అనుమతించేదిలేదని కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అమెరికా సంస్థ మెటాకు స్పష్టం చేసింది. దేశ ప్రజల డేటాను దోపిడీ చేస్తామంటే సమర్థించలేమని స్పష్టం చేశారు.
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై విచారణ
2021నాటి వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా గతంలో కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధించిన రూ.213 కోట్ల జరిమానాను సమర్థించింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను పంచుకునేందుకు వాట్సాప్ దోపిడీవిధానాన్ని అనుసరిస్తోందని తెలిపారు. సీజేఐ స్పందిస్తూ.. మా రాజ్యాంగాన్ని అనుసరించలేకపోతే దేశం విడి చి వెళ్లిపోవచ్చు. పౌరుల సమాచారాన్ని పంచుకునే విషయంలో మేం రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీజేఐ.. తన సొంత అనుభవాన్ని వివరించారు. ‘‘వాట్సాప్ పలో ఓ డాక్టర్కు మెసేజ్ పంపితే.. ఆయన ప్రిస్ర్కిప్షన్ లో కొన్ని మందులు సూచించారు. ఆ మరుక్షణం వాటికి సంబంధించి న ప్రకటనలే ఫోన్ లో కనిపించాయి’’అని తెలిపారు.
అసలు ఏం జరిగింది?
2021 జనవరిలో వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానాన్ని తీసుకువచ్చింది. తమ కొత్త పాలసీని అంగీకరించని వారి ఖాతాలను రద్దు చేస్తామని ప్రకటించింది. దీంతో అప్పట్లోనే కేంద్రం సదరు పాలసీని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై సీసీఐ విచారణ జరిపింది. ఈ క్రమంలోనే 2024లో రూ.213 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానాను కంపెనీ లా ట్రైబ్యునల్ కూడా సమర్థించింది. ఈ తీర్పులను మెటా గత ఏడాది జనవరిలో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.





