
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్ కుప్పకూలడంతో అందులోనే కూరుకుపోయిన 8 మంది కార్మికుల జాడ ఇంకా తెలియడం లేదు. టన్నెల్ కూలి 50 గంటలు అవుతున్నా కనీసం వాళ్లు ఎక్కడ చిక్కుకున్నారో కూడా గుర్తించలేకపోయారు. భారత సైన్యం, నౌకాదళంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు ముమ్మరంగా సహాయచర్యల్లో పాల్గొంటున్నాయి. ఆర్మీ, NDRF బృందాలు ప్రయత్నించానా ఫలితం లేకపోయింది. టన్నెల్ మొత్తం బురదమయంగా ఉండటం, టీబీఎం యంత్రం పై భాగం కుంగిపోవడం, దాంతో పాటు ఇతర పరికరాలు అడ్డంగా పడి ఉండటంతో ముందుకెళ్లలేని పరిస్థితి తలెత్తింది.
శ్రీశైలం జలాశయం వైపు నుంచి 14వ కిలోమీటరు వద్ద సొరంగంలో పనిచేస్తుండగా పైకప్పు కూలింది. ఆ సమయంలో 8 మంది ఆచూకీ కనిపించకుండా పోయింది. వీరిలో ఎవరైనా, ఏదైనా ఆసరాగా చేసుకుని సాయం కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చన్న ఆశలతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ కోణంలో డ్రోన్తోపాటు, స్కానర్లు, నైట్ విజన్ కెమెరాలతో కూడా దళాలు ప్రయత్నించాయి. టన్నెల్ బోరింగ్ యంత్రం వద్దకు దాదాపు చేరుకున్న కొందరు రక్షణ సభ్యులు బురదలోకి దిగే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ కటిక చీకటితోపాటు బురదలో కూరుకుపోయే పరిస్థితి ఉండటంతో వెనక్కు వచ్చేశారు. దూరం నుంచి బిగ్గరగా కేకలు వేస్తూ.. బాధితుల నుంచి స్పందన వస్తుందేమోనని చాలా సేపు ప్రయత్నాలు చేశారు. అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో వారి పరిస్థితి ఎలా ఉందన్నది తెలియరాలేదు.
టన్నెల్ పై కప్పు కూలిన ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్ల వెనక్కు బురద, నీళ్లు ఎగదన్నాయని ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికే వెళ్లడించారు. ఆ నీటిని భారీ మోటార్లు పెట్టి ఎత్తిపోస్తూ శ్రీశైలం జలాశయంలోకి తరలిస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీ ఉన్న పంపులను వినియోగిస్తున్నారు. 13.5 కిలోమీటరు వద్ద ఒక పంపును మధ్యాహ్నం అందుబాటులోకి తీసుకొచ్చారు. లోపల విద్యుత్ సరఫరా లేని చోట కూలిపోయిన ఇనుప రెయిలింగ్, రాడ్లను తొలగించేందుకు కట్టర్లు కావాల్సి వచ్చింది. సాయంత్రం తరువాత లోపల ఉన్న ఇనుప కడ్డీలను కట్ చేయడం ప్రారంభించారు. వీటన్నింటినీ తొలగిస్తేనే ప్రమాదస్థలం వరకు రక్షణ బృందాలు వెళ్లడానికి వీలవుతుందని ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి.
మంత్రి ఉత్తమ్ సంప్రదింపులతో కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం నుంచి మూడు హెలికాప్టర్ల ద్వారా నౌకాదళం సభ్యులను ఎస్ఎల్బీసీ ప్రాంతానికి పంపించింది. తొలుత సంఘటన ప్రాంతాన్ని హెలికాప్టర్ల నుంచే ఆ దళం పరిశీలించింది. సోమవారం వారు కూడా రంగంలోకి దిగుతారని సమాచారం. భూగర్భ గనుల్లో రక్షణ చర్యలపై అవగాహన ఉన్న సింగరేణి విపత్తు నిర్వహణ బృందం కూడా పలు పరికరాలతో చేరుకుంది. మొత్తంగా సహాయ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ నుంచి 130 మంది, ఎస్డీఆర్ఎఫ్ నుంచి 120 మంది, ఆర్మీ నుంచి 24 మంది, సింగరేణి రెస్క్యూ టీం నుంచి 24 మంది, హైడ్రా నుంచి 24 మంది నిమగ్నమయ్యారు.