
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. విచారణలో దూకుడు పెంచిన ఏసీబీ.. కీలక నేతలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ నేతల వాంగ్మూలాలను ఇప్పటికే నమోదు చేసుకున్న సిట్ దూకుడు పెంచబోతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావుకు త్వరలోనే నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమవుతున్నట్టు అధికారికవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇప్పటి వరకు సిట్ ఎదుట విచారణకు హాజరైన సస్పెండెడ్, మాజీ పోలీసు అధికారులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వీరిని విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు విచారణకు హాజరైన ప్రణీత్రావు, ప్రభాకర్రావు సహా నిందితులందరు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నేతల ఆదేశం మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించారు. వారు చెబితేనే విపక్ష లీడర్ల ఫోన్లు ట్యాపింగ్ చేశామని ఎంక్వయిరీ సమయంలో ఒప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆదేశాలు ఏ విధంగా ఇచ్చారు? అనే అంశంపై సిట్ ఆరా తీయగా.. కొన్ని సార్లు మౌఖికంగా, మరికొన్ని సార్లు వాట్సాప్ మెసేజ్లు పంపించారని వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో సిట్ అధికారులు కేటీఆర్, హరీశ్ రావును ఎంక్వయిరీకి పిలిచే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.