జాతీయం

Modi-Satya Nadella: భారత్‌లో 1.58 లక్షల కోట్ల పెట్టుబడులు, మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం!

భారత్ లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్ల వెల్లడించారు. ఏఐ రంగంలో రూ.1.58 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించారు.

Satya Nadella-Modi Meet: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.. ఏఐ రంగంలో రూ.1.58 లక్షల కోట్లు  పెట్టుబడులు పెడతామని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. ఇది ఆసియాలోనే తమ కంపెనీకి సంబంధించి అతి పెద్ద పెట్టుబడి అని తెలిపారు. ప్రధాని మోడీతో సత్య నాదెళ్ల ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ లో తమ కంపెనీ పెట్టుబడుల గురించి చర్చించారు.

భారత్ లో రూ. 1.58 లక్షల కోట్ల పెట్టుబడులు

అనంతరం సోషల్ మీడియా వేదికగా సత్యా నాదెళ్ల కీలక ప్రకటన చేశారు. “భారత్‌ ఏఐ భవిష్యత్తుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంచుకోవటంలో సాయపడేందుకు ఈ పెట్టుబడులు పెట్టనున్నాం” అని ప్రకటించారు. ఇదే అంశంపై మైక్రోసాఫ్ట్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. 2026-29 మధ్య నాలుగేళ్ల వ్యవధిలో రూ.1.58 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నామని, ఏఐని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తామని తెలిపింది. డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ దిశగా భారత్‌ అడుగులు వేస్తున్న సమయంలో.. భారతీయ వినియోగదారులకు  సావరీన్‌ పబ్లిక్‌ క్లౌడ్‌, సావరీన్‌ ప్రైవేట్‌ క్లౌడ్‌ను తాము తీసుకొస్తున్నామని మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది.

2 కోట్ల మందికి శిక్షణ

ఏఐలో శిక్షణ పొందిన మానవ వనరుల ద్వారానే భారత్‌ ఏఐ రంగంలో ముందడుగు వేయగలుగుతుందని తెలింది. ఈ మేరకు 2030 నాటికి భారత్‌లో 2 కోట్ల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ అందిస్తామని వెల్లడించింది. అటు అడ్వాంటేజ్‌ ఇండియా కార్యక్రమం కింద ఇప్పటికే 56 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని తెలిపింది. భారత్‌లో 300 కోట్ల డాలర్ల (రూ.26,955 కోట్ల) పెట్టుబడులు పెడతామని ఈ ఏడాది ప్రారంభంలో తాము చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ.. ఈ మొత్తాన్ని వచ్చే ఏడాది పూర్తయ్యేలోపు ఖర్చు చేస్తామని మైక్రోసాఫ్ట్‌ స్పష్టం చేసింది.

ప్రపంచ ఏఐ హబ్‌గా భారత్‌

అటు, ప్రపంచ ఏఐ హబ్‌గా భారత్‌ నిలిచేందుకు మైక్రోసాఫ్ట్‌ తాజా పెట్టుబడులు తోడ్పడనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. క్లౌడ్‌ స్కేలింగ్‌, కంప్యూటింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఏఐ స్కిల్‌ ప్రోగ్రామ్స్‌, డేటా సిస్టమ్‌ల భద్రత వంటి విభాగాల్లో మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యం, తయారీ, ప్రభుత్వ పాలన, విద్య, ఆర్థిక సేవలు తదితర రంగాలకు భారత్‌ ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పెట్టుబడులను సమన్వయపర్చనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. ప్రపంచం ఆధారపడదగిన టెక్నాలజీ భాగస్వామిగా భారత్‌ ఎదిగిన తీరుకు మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడుల ప్రకటన తాజా సంకేతమన్నారు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌. డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ నుంచి ఏఐ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌గా భారత్‌ వేస్తున్న ముందంజకు ఈ పెట్టుబడులు దోహదం చేస్తాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button