Bengaluru Tech Employee Arrested: బెంగళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీ అమడియస్ సాఫ్ట్ వేర్ ల్యాబ్స్ ఇండియా(ప్రైవేట్) లిమిటెడ్ లో సీనియర్ ఉద్యోగి కంపెనీ యాజమాన్యానికి చెందిన సాఫ్ట్ వేర్ సోర్స్ కోడ్ను దొంగిలించిన కేసు వెలుగులోకి వచ్చింది. ఈ డేటా విలువ సుమారు రూ.87 కోట్లుగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
ఉద్యోగంలో నుంచి తొలగింపు
నిందితుడు అశుతోష్ నిగమ్ 2020 ఫిబ్రవరి 1 నుంచి సదరు కంపెనీలో సీనియర్ మేనేజర్ రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. 2025 అక్టోబర్ 11న అశుతోష్ అనధికారికంగా కంపెనీ సోర్స్ కోడ్, కంపెనీకి చెందిన గోప్యంగా ఉంచాల్సిన డేటాను తన పర్సనల్ ఈ-మెయిల్ అకౌంట్ ద్వారా బయటకు తరలించాడని కంపెనీ వెల్లడించింది. ఇది కంపెనీ అంతర్గత దర్యాప్తులో తేలిందని చెప్పింది. దీంతో తగిన ఆధారాలు, రికార్డులతో అతడ్ని కంపెనీ యాజమాన్యం ప్రశ్నించగా.. తన తప్పును అశుతోష్ అంగీకరించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అశుతోష్ స్టేట్మెంట్ను కంపెనీ వీడియో రికార్డ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆ కంపెనీ అశుతోష్ను 2025 డిసెంబర్ 3న ఉద్యోగం నుంచి తొలగించారు.
కంపెనీకి తీవ్ర నష్టం
అశుతోష్ చర్య వల్ల కంపెనీకి తీవ్ర వ్యాపార నష్టం వాటిల్లడమే కాకుండా.. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ హక్కులు దెబ్బతిన్నాయని సందరు కంపెనీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. కంపెనీ ప్రతినిధి ఫిర్యాదు మేరకు వైట్ఫీల్డ్ CEN క్రైమ్ పోలీస్ స్టేషన్లో 2026 జనవరి 23న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐటీ యాక్ట్ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.





