Homeతెలంగాణనిరుద్యోగ యువతకు రేవంత్ సర్కార్ శుభవార్త...!

నిరుద్యోగ యువతకు రేవంత్ సర్కార్ శుభవార్త…!

⦿ తెలంగాణలో త్వరలో 14,553 ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

⦿  పోలీస్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం..!

⦿ రాష్ట్రంలో కొత్తగా రెండు స్పెషల్‌ పోలీసు బెటాలియన్లు..!

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా ఖాకీ దుస్తులు ధరించి ప్రజల కోసం సేవ చేయాలని భావించే యువతకు ఇది గొప్ప అవకాశం. రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రస్తుతం 17 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత పదేళ్ల కాలంలో ప్రభుత్వం మూడుసార్లు భారీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. 2015లో 18 వేలు, 2018లో 18 వేలు, 2022లో 15,664 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. నిరంతరం కొనసాగుతున్న పదవీ విరమణల కారణంగా ఖాళీల సంఖ్య మళ్ళీ భారీగా పెరిగింది. ఏటా ఆరు నుంచి ఏడు వేల మంది సిబ్బంది రిటైర్ అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

14,553 పోలీస్ ఉద్యోగాలకు రంగం సిద్ధం..

అయితే.. ముందుగా రాష్ట్రంలో 14,553 కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడంతోపాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న రెండు పోలీసు బెటాలియన్లకు కొత్త నోటిఫికేషన్ ద్వారా సిబ్బందిని సర్దుబాటు చేయనున్నారు. కానిస్టేబుళ్లు, ఎస్సైల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ వచ్చే ఛాన్స్ ఉంది. సంస్ధాన్‌ నారాయణపూర్‌లో 84.24 ఎకరాల్లో, అమన్‌గల్‌లో 125 ఎకరాల్లో తెలంగాణ స్పెషల్‌ పోలీసు బెటాలియన్లను ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనుంది.

నోటిఫికేషన్ ఆలస్యమైతే..?

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ చాలా కీలకమైన అంశం. సిబ్బంది కొరత కారణంగా ప్రస్తుతం ఉన్న పోలీసులు పనిభారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను కాపాడాలంటే పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండాల్సిన అవసరం ఉంది. పోలీస్ శాఖలో మొత్తం 95,361 పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం 77,369 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఒకవేళ నోటిఫికేషన్ ఆలస్యమైతే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను వివరిస్తూ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సమగ్ర నివేదికను పంపారు. పోస్టుల భర్తీకి తక్షణమే అనుమతులు ఇవ్వాలని కోరారు.

పోలీస్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మిగిలిన పోటీ పరీక్షలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్ష రాయాలి. అందులో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఈ మూడు దశలు పూర్తి కావడానికి కనీసం ఒక ఏడాది సమయం అయినా పడుతుంది. ఒకవేళ న్యాయపరమైన చిక్కులు ఎదురైతే ఈ ప్రక్రియ ఇంకా జాప్యం జరిగే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు కఠినమైన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే నోటిఫికేషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించడం చాలా అవసరం.

అయితే ప్రస్తుతం ప్రభుత్వం నుంచి పచ్చజెండా ఊపడమే తరువాయి భాగం. భారీ స్థాయిలో నోటిఫికేషన్ వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఖాళీల వివరాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అందుకే యూనిఫాం పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్ మొదలు పెట్టడం బెటర్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం తక్కువగా ఉంటుంది. ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటు రాత పరీక్షపై పట్టు సాధిస్తేనే ఈ కొలువు సాధించడం సాధ్యమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments