ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో రేషన్‌ రాజకీయం - చంద్రబాబు వ్యూహం వర్కౌట్‌ అయ్యిందా..?

క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : వైసీపీ విధానాలకు పూర్తిగా చెక్‌ పెడుతోంది కూటమి ప్రభుత్వం. ప్రభుత్వ పథకాల్లో… వైసీపీ వాసనలు లేకుండా జాగ్రత్త పడుతోంది. అందులో భాగంగా.. అధికారంలోకి రాగానే పథకాలు పేర్లు మార్చింది. వాలంటీర్ల వ్యవస్థను పక్కపడేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనితీరు మార్చింది. ఇప్పుడు… రేషన్‌ సరుకుల పంపిణీ విధానాన్ని కూడా ఛేజ్‌ చేసింది. రేషన్‌ వాహనాలను తీసేసింది. రేషన్‌ షాపులను మళ్లీ పునఃప్రారంభించింది. ఈ నెల నుంచి రేషన్‌ షాపుల్లోనే సరుకులు పంపిణీ చేస్తోంది.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో.. రేషన్‌ డీలర్ల వల్ల అక్రమాలు జరుగుతున్నాయని.. రేషన్‌ పంపిణీకి వాహనాలు పెట్టారు. నిరుద్యోగులతో వాహనాలు కొనిపించి… వారితో అగ్రిమెంట్‌ చేయించుకుని… రేషన్‌ సరుకుల పంపిణీకి ఆ వాహనాలు వాడుకున్నాడు. దీని వల్ల నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని చెప్పింది వైసీపీ. అయితే… కూటమి ప్రభుత్వం ఆ విధానాన్ని తప్పుబట్టింది. రేషన్‌ వాహనాల వల్ల… బియ్యం అక్రమ రవాణా పెరిగిపోయిందని ఆరోపించింది. రేషన్‌ వాహనాలతో ఇంటింటికీ సరుకులు సరఫరా చేయకపోగా.. ఊర్లో ఒక చోట వాహనం నిలిపి.. అక్కడ జనాలను క్యూకట్టించి.. సరుకులు ఇచ్చేవారని తెలిపింది. రెండు, మూడు అలా వాహనాలు ఊర్లోకి వచ్చేవని… ఆ సమయంలో తీసుకోని వారికి .. ఇక రేషన్‌ అందేది కాదని.. మిగిలిన సరుకులను కాకినాడ, విశాఖ పోర్టుల ద్వారా ఎక్స్‌పోర్ట్‌ చేసేవారన్నది కూటమి సర్కార్‌ ఆరోపణ. అందుకే.. రేషన్‌ వాహనాలను తొలగించి.. మళ్లీ రేషన్‌ షాపులను పునఃప్రారంభించామని చంద్రబాబు ప్రభుత్వం చెప్తోంది. అంతేకాదు.. ఒకటి, రెండు రోజులు కాకుండా… నెలలో మొదటి 15 రోజుల పాటు రేషన్‌ సరుకుల పంపిణీ జరుగుతుందన్నారు. వేరే ప్రాంతాలకు మారికి పోర్టబిలిటీ విధానంలో రేషన్‌ తీసుకోవచ్చని కూడా స్పష్టం చేశారు. దీంతో.. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. రేషన్‌ షాపులు తీయగానే… సరుకుల కోసం క్యూకడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దాదాపు 30 వేల వరకు రేషన్‌ షాపులు ఉన్నాయి. వీటన్నింటినీ ఒకటో తేదీన తిరిగి తెరిపించారు. దీంతో.. రేషన్‌ డీలర్ల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇకపై రోజూ రెండు పుటలా రేషన్‌ దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు ప్రజాప్రతినిధులు. అంతేకాదు… ఆదివారం కూడా షాపులు ఓపెన్‌లోనే ఉంటాయని చెప్పారు. ఇక… దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి దగ్గరకే.. డీలర్ల ద్వారా సరుకు ఇంటి సరఫరా చేయిస్తామంటున్నారు. అందు కోసం.. గ్రామంలోని 65ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు… రేషన్‌ షాపుల్లో పేర్లు నమోదు చేసుకుంటే చాలంటున్నారు. రేషన్‌ సరుకుల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా… ప్రత్యేక యాప్‌ కూడా రూపొందించారు. అందులో డీలర్ల ఫొటోలు… వివరాలు ఉంచారు. సరుకు ఎంత వచ్చింది.. ఎంత తీసుకున్నారు.. వంటి పూర్తి సమాచారం ఆ యోప్‌లో కనిపిస్తుంది.

రేషన్‌ షాపుల్లో సరుకు పంపిణీని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజల ఇంటికే అందుతున్న ప్రభుత్వ సేవలను ఎందుకు తీసేస్తున్నారని ప్రశ్నించారు వైఎస్‌ జగన్‌. పేదలకు మళ్లీ రేషన్‌ కష్టాలు ఎందుకు తెచ్చిపెట్టారని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు. ఈ ప్రభుత్వం… రేషన్‌ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్ట కొడుతోందని ఆరోపించారు. అంతేకాదు… వైసీపీ నేతలు ఒక అడుగు ముందుకేసి… రేషన్‌ వాహనదారులు కాదు… ఎమ్మెల్యేలే స్మగ్లర్లన ఆరోపించారు. మొత్తంగా… టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధంతో ఏపీ రేషన్‌ రాజకీయం వేడెక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button