
Weather Update: రుతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరించాయి. వీటి ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వానలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంతో పాటు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. మొత్తం 19 జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. వర్షాలు వచ్చే సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండటం మంచిదని అధికారులు సూచించారు.
ఆంధ్రాలో మూడు రోజులు వర్షాలు
ఇక ఉత్తర బంగాళాఖాతంను ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో అల్ప పీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో పలు చోట్ల తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సముద్ర తీరం వెంబడి 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాబోయే మూడు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సముద్రంలో అలజడిగా ఉన్న సమయంలో వేటకు వెళ్లకూడదని జాలర్లకు వార్నింగ్ ఇచ్చారు.
Read Also: హైదరాబాదీలకు తాగునీళ్ల గండం.. మంజీరా బ్యారేజీ కూలిపోయే ప్రమాదం?