కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న అనంతరం అక్కడి నుంచి నేరుగా వికారాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో అనంతగిరి చేరుకుంటారు.
పార్టీ నేతలతో కీలక సమావేశాలు..
తొలుత టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత వ్యవస్థ, కేడర్ పరిస్థితులపై నేతల నుంచి వివరాలు తెలుసుకుంటారు. అనంతరం వికారాబాద్లో నిర్వహిస్తున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు.
కొత్తగా నియమితులైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు పార్టీ బలోపేతం, గ్రౌండ్ స్థాయిలో సంస్థాగత నిర్మాణం, సంక్షేమ పథకాల ప్రచారం వంటి అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా స్థాయిలో పార్టీని మరింత చురుకుగా తీర్చిదిద్దాలన్న దిశగా సూచనలు ఇవ్వనున్నారు.
రాష్ట్ర రాజకీయ అంశాలపై చర్చ
డీసీసీ అధ్యక్షులతో పాటు వారి కుటుంబ సభ్యులతో కూడా రాహుల్ గాంధీ ముఖాముఖి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్నదానిపై చర్చించనున్నారు.
అలాగే ఇటీవల లొంగిపోయిన కొంతమంది మావోయిస్టు నేతల అంశంపై పార్టీ నాయకులు అధినేతకు వివరాలు అందించే అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగిన AI సమ్మిట్ సందర్భంగా నిరసన తెలిపినందుకు అరెస్టయిన మహబూబ్నగర్ జిల్లాకు చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడి కుటుంబ సభ్యులను కూడా రాహుల్ గాంధీ కలిసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాజ్యసభ సీట్లపై తుది చర్చ
మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు కూడా ఈ పర్యటనలో కీలక అజెండాగా మారనున్నాయి. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల అభ్యర్థుల పేర్లపై సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం ఉంది.
రేసులో ప్రధానంగా అభిషేక్ మను సింఘ్వీ, జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, వీ హనుమంతరావు, పార్టీ సీనియర్ నేతలు శ్యామ్ మోహన్, కోదండ రెడ్డి, చిన్నారెడ్డి, మధు యాస్కీ గౌడ్, షబ్బీర్ అలీ తదితరులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ALSO READ: Telangana Politics: కేసీఆర్ పిలిస్తే.. కవిత వెనక్కి వెళ్తారా..?
