ఖమ్మం, క్రైమ్ మిర్రర్: గెలిచే వరకే రాజకీయాలని గెలిచిన తరువాత ప్రజా సేవకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు.మంత్రి మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
భగవంతుడు మనకు ప్రజా ప్రతినిధులుగా ప్రజలకు సేవ చేసే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. మనం రాజకీయాల్లోకి వచ్చినపుడు ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయే పనులు చేయాలి. మనం చేసే పని, మనం లేకున్నా నాలుగు కాలాల పాటు మన గురించి గొప్పగా చెప్పుకునేలా ఉండాలని అన్నారు.గ్రామ పంచాయతీల బలోపేతం కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, పంచాయతీల్లో జమఅయిన నిధులను ప్రజలకు ఉపయోగపడే పనులకు వినియోగించాలన్నారు.
మన సొంత డబ్బును ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో ప్రజా ధనాన్ని కూడా అంతే బాధ్యతగా కాపాడుతూ అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.వేసవి కాలం దృష్ట్యా, గ్రామాలలో మరియు డివిజన్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలి. మురుగునీరు రోడ్ల మీద నిలవకుండా డ్రైనేజీ పైప్లైన్ల నిర్వహణ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ది చేయాలని, ఏ పార్టీ, ఏ జెండా అనేది ముఖ్యం కాదు, ప్రజలకు మంచి చేశామా లేదా అనేదే ముఖ్యమని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.
