
PM Mpdi Foreign Tour: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. జులై 2 నుంచి 9 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ టూర్ లో భాగంగా ఆయన 5 దేశాలకు వెళ్తనున్నారు. ఆయా దేశాలతో పలు కీలక అంశాలకు సంబంధించి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. పర్యటనలో అత్యతం కీలకమైన బ్రెజిల్ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. భారత్, రష్యా, చైనా సహా మొత్తం 10 దేశాలు బ్రిక్స్ కూటమిలో ఉన్నాయి. ఈ సందర్భంగా పలు దేశాలతో పలు ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తం 5 దేశాల్లో ప్రధాని మోడీ పర్యటన
తొలుత బ్రిక్స్ సమ్మిట్ కోసం బ్రెజిల్ కు వెళ్లే భారత ప్రధాని ఆ తర్వాత ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాల్లో పర్యటించనున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ప్రధాని ముందుగా జులై 2, 3న ఘనాకు వెళ్తారు. ప్రధాని హోదాలో మోడీ ఆ దేశానికి వెళ్లడం ఇదే తొలిసారి. ఆ తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఆ దేశ అధ్యక్షుడు క్రిస్టిన్ కార్లా కంగాలూతో పాటు ప్రధానమంత్రి కమ్లా పర్సాద్ బిస్సెస్సార్ తో పలు అంశాల గురించి చర్చించనున్నారు. 1999 తర్వాత భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. అటు అర్జెంటీనా పర్యటనలో భాగంగా అత్యంత ముఖ్యమైన అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, సహజవాయువు, పునరుత్పాదక విద్యుత్తు లాంటి అంశాలపై ఇరు దేశాలు చర్చలు జరుపుతాయి. ఆ తర్వాత ఆయన బ్రెజిల్ కు వెళ్తారు. ప్రధాని మోడీ బ్రెజిల్ కు వెళ్లడం ఇది నాలుగోసారి. బ్రిక్స్ సమ్మిట్ తర్వాత చివరగా మోడీ నమీబియాకు వెళ్తారు. నమీబియా అధ్యక్షుడు నెటుంబోతో పలు అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు విదేశాంగ అధికారులు తెలిపారు.